Monday, April 29, 2024

ఎన్నిక ఏకగ్రీవం

తప్పక చదవండి
  • నేడు ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్‌
  • స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌
  • మద్దతు పలికిన విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ
  • నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం
  • కేటీఆర్‌ సహా పలువురు మంత్రుల రాక
  • నేటి ఉదయంనుంచే తెలంగాణ అసెంబ్లీ
  • స్పీకర్‌ ఎన్నికతో తొలిరోజు సమావేశం
  • 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
  • 16న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం
  • నాటీ బీఆర్‌ఎస్‌ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదలకు ఛాన్స్‌

హైదరాబాద్‌ : అసెంబ్లీ స్పీకర్‌ పదవి కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎంఐఎం, సీపీఐ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తదితరులు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడ్డం ప్రసాద్‌ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గురువారం ఆయన అసెంబ్లీలో స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్లకు గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పదవికి ఒకే ఒక నామినేషన్‌ దాఖలు అయింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి గడ్డం ప్రసాద్‌ అసెంబ్లీ స్పీకర్‌గా నామినేషన్‌ వేశారు. నేడు సభలో ప్రొటెం స్పీకర్‌ అధికారికంగా అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్‌ పదవి కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు సైతం నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పీకర్గా గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవం కానున్నారు. 15న అసెంబ్లీ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. 16న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చేయనున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గడ్డం ప్రసాద్‌ రాజకీయ ప్రస్థానం 2008లో మొదలయ్యింది. ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఓడిపోయారు. ఓటమితో పార్టీ మారలేదు. నియోజకవర్గాన్నీ మార్చలేదు. వికారాబాద్‌ నే అంటిపెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2008లో తొలిసారిగా వికారాబాద్‌ నుంచి గెలుపొందిన ఆయన 2009లో మళ్లీ వికారాబాద్‌ నుంచి గెలుపొందారు. 2014, 2018లో వికారాబాద్‌ నుండి రెండుసార్లు ఓడిపోయారు. కానీ 2023లో మళ్లీ గెలిచారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 3వ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2012లో నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. టెక్స్‌ టైల్‌ శాఖా మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కూడా ఆయన పరాజయాన్ని చవిచూశారు. 2018 తర్వాత గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్‌ 10న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఆ తర్వాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో గడ్డం ప్రసాద్‌ కుమార్‌ విజయాన్ని సాధించి స్పీకర్‌గా నియమితులయ్యారు.
కాగా, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయానికి వెళ్లి మాజీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం స్పీకర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ను శ్రీధర్‌ బాబు ఆహ్వానించారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి వెళ్లి స్పీకర్‌ నామినేషన్‌ పత్రాలపై కేటీఆర్‌ సంతకం చేశారు. గడ్డం ప్రసాద్‌ స్పీకర్‌గా తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్‌ కానున్నారు. ప్రస్తుత శాసన సభలో అత్యధిక మంది సభ్యులు అగ్రకులాలకు చెందిన వారేనన్న సంగతి తెలిసిందే. సభలో వారికి మాట్లాడే అవకాశం ఇచ్చే, వారిని నియంత్రించే అధికారాలు కలిగిన స్పీకర్‌ పదవిని దళిత నేతకు ఇస్తున్నామన్న భావనను ప్రజల్లోకి పంపేందుకే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
స్పీకర్‌ ఎన్నికతో తెలంగాణ ఆసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరవాత తొలిసారిగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికార పార్టీగా కూర్చోబెట్టిన ప్రజలు.. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల స్థానాలు మారినా ఇరుపార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు తప్పేలా లేవు. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ నేతలు నిలదీస్తామన్న రీతిలో ప్రకటనలు ఇస్తున్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని హరీష్‌ రావు, తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కారని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఇకపోతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ 64 మంది సభ్యులతో, ఒక్క సీపీఐ ఎమ్మెల్యే మద్ధతుతో, ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. మరో వైపు 39 ఎమ్మెల్యేలతో గులాబీ పార్టీ, 8 మంది ఎమ్మెల్యేలతో కమలం పార్టీ, 7 గురు ఎమ్మెల్యేలతో ఎం.ఐ.ఎం పార్టీ ఈ కొత్త అసెంబ్లీలో కొలువు తీరనున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్‌ టార్గెట్‌గా పని చేయనున్నాయి.
తదనంతరం జరిగే బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీ చర్చించాల్సిన ఎజెండా, ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్న దానిపై స్పష్టత రానుంది. 14న సమావేశాల తరవాత 15న గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ క్రమంలో తరవాత ఒకటి రెండురోజులు మాత్రమే సమావేవాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. అధికార కాంగ్రెస్‌ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్‌, గత పదేళ్లుగా అధికార పార్టీగా పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హవిూల అమలుపై బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ ను పట్టుపట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇష్టారీతిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు హవిూలు ఇచ్చిందని అందుకు నిధులు ఎలా తెస్తారో.. ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీల పథకాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ సైతం రాష్ట్రంలో పదేళ్లుగా సాగిన గులాబీ పాలనపైన విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపైన ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి బీఆర్‌ఎస్‌ ను ఇరుకునపెట్ట వచ్చని తెలుస్తోంది. అప్పులు చేసిన తీరుపైన , విద్యుత్‌ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపైన బీఆర్‌ఎస్‌ ను కార్నర్‌ చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు