Monday, April 29, 2024

తెలంగాణ నుంచి సోనియా పోటీపీఏసీలో ఏకగ్రీవ తీర్మానం

తప్పక చదవండి
  • మాణిక్‌ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ భేటీ
  • నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అతి త్వరలో
  • కాంగ్రెస్‌ పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు
    కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ
  • గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం
  • రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ సహా పాల్గొన్న పలువురు నేతలు

ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దివంగత నేత ఇందిరాగాంధీ గతంలో మెదక్‌ నుంచి పోటీ చేశారని గుర్తుచేశారు. ఆరు గ్యారంటీల విషయంపై పీఏసీలో చర్చ చేశామని చెప్పారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి సోనియా గాంధీ అయితే తెలంగాణ నుంచి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సోనియా గాంధీ.. తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ తెలిపారు. ‘తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీకు రుణపడి ఉంటాం’ అని సోనియా గాంధీని ఉద్దేశించి ఈ సమావేశంలో నేతలందరూ పేర్కొన్నారు. అదేవిధంగా 6 గ్యారంటీలపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించినట్లు షబ్బీర్‌ అలీ తెలిపారు. మిగిలిన గ్యారెంటీలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటిస్తారని ఆయన వెల్లడిరచారు. గాంధీ భవన్‌లో సోమవారం పీఏసీ సమావేశం అనంతరం మీడియాకు ఆయన వివరాలు వెల్లడిరచారు. ఈ నెల28న నాగ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్‌ ఫౌండేషన్‌ డేకు తెలంగాణ నుంచి సుమారు 50 వేల మంది పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంతో ఘోరంగా ఉందని ఆ విషయంపై చర్చ జరిగిందన్నారు. ఎల్లుండి అసెంబ్లీలో ఫైనాన్స్‌ పొజిషన్‌, తెలంగాణ అప్పుల వివరాలు ఫైనాన్స్‌ మినిస్టర్‌ భట్టి విక్రమార్క ప్రవేశాపెట్టబోతున్నారని చెప్పారు. ఇరిగేషన్‌ శాఖలో జరిగిన అవకతవకల గురించి, ఒక్క కాళేశ్వరం మీద 85 నుంచి 90 వేల కోట్లు ఖర్చుపెట్టి కనీసం 90 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించారు.

ప్రాజెక్టుల అవకతవకల అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఇరిగేషన్‌, ఎనర్జీ, ఫైనాన్స్‌ అవకతవకలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఎనర్జీ విషయంలో కూడా రూ.80 కోట్ల వరకు అప్పులు చేశారని తెలిపారు. మిషన్‌ భగీరథలో అవకతవకలపై కూడా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. కేసీఆర్‌ అహంకారం వల్ల రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని మండిపడ్డారు. రేషన్‌ కార్డులు, ఆసర పెన్షన్‌ లాంటి వాటిపై త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

- Advertisement -

వీలైనంత త్వరలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ
నామినేటెడ్‌ పోస్టుల భర్తీని వీలైనంత త్వరగా భర్తీ చేస్తానని ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. తద్వారా మరి కొంత మంది సీనియర్‌ నేతలు, పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్‌ 28న నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర)లో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి 50 వేల మందిని తరలించాలని పీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

పీఏసీ సమావేశంలో చేసిన 3 తీర్మానాలు:

కాంగ్రెస్‌ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు
సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా జాతీయ నేతలకు ధన్యవాదాలు
` సోనియా గాంధీ ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలి

పార్లమెంట్‌ ఎన్నికలపై చర్చ
ఇక పార్లమెంట్‌ ఎన్నికల పైనా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. పలు పార్లమెంట్‌ స్థానాలకు మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ బాధ్యతలను చూడనున్నారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క – ఆదిలాబాద్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి – ఖమ్మం, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి – నల్గొండ, పొన్నం ప్రభాకర్‌ – కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానాలను పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. ఇరిగేషన్‌ శాఖలో జరిగిన అవకతవకలపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు. సాగునీటి ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసినా ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఉత్తమ్‌ అన్నారు. విద్యుత్‌, ఫైనాన్స్‌, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు