Saturday, April 27, 2024

ఇష్టమొచ్చినట్టు హామీలు

తప్పక చదవండి
  • హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం
  • ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం
  • కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో
  • అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఏనాడు కలగనలేదు
  • కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వార్నింగ్‌

హైదరాబాద్‌ : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ వాళ్లుకూడా కలగనలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. హామీలకు కాంగ్రెస్‌ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.. అయినా వదిలిపెట్టం అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ భవన్‌ లో నల్గొండ లోక్‌ సభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే కథనాయకులు, కార్యకర్తల వల్లే ఇన్నేళ్లుగా పార్టీ బలంగా ఉందని అన్నారు. గత 16 సమావేశాల తీరుచూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని అన్నారు. నల్గొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించింది.. ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదు.. ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయి.. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో మాత్రమే గెలిచామని అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారని కేటీఆర్‌ అన్నారు. ఓటమికి అనేక కారణాలున్నాయని, ఈ పార్లమెంట్‌ సన్నాహక సమావేశాలు ఆరంభం మాత్రమేనని, ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్టలేక పోయాం.. అవతలి వాళ్లు అభూత కల్పనలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోబ పట్టించారని కేటీఆర్‌ అభిప్రాయ పడ్డారు. మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టలేదు.. కానీ, కాంగ్రెస్‌ వాళ్లు ఉలిక్కి పడుతున్నారు.. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ వాళ్లుకూడా కలగనలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్లు హామీలు గుప్పించారు.. అధికారంలోకి వచ్చిన తరువాత హామీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని, హామీలు అమలయ్యే వరకు వదిలిపెట్టమని కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాంస వీడాలి.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతలు ఏం మాట్లాడారు.. ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరిచి చెప్పాలని అన్నారు. కోమటిరెడ్డి గత నవంబర్‌ నెలలోనే కరెంట్‌ బిల్లులు కట్టొద్దని చెప్పారు.. నల్గొండ ప్రజలు బిల్లులు కట్టకుండా వాటిని కోమటిరెడ్డికి పంపించాలని కేటీఆర్‌ అన్నారు. సాగర్‌ ఆయకట్టుకు కాంగ్రెస్‌ పాలనలో మొదటిసారి క్రాప్‌ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురించిందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా రివర్‌ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్‌ కేంద్రం చేతిలో పెడుతోందని, శ్రీరాం సాగర్‌ చివరి ఆయకట్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎండబెడుతోంది కేటీఆర్‌ విమర్శించారు. కరెంట్‌ కోతలు అప్పుడే మొదలయ్యాయని విమర్శించారు. రేవత్‌ భుజంమీద తుపాకీ పెట్టి మోడీ బీఆర్‌ఎస్‌ను కాలుస్తారట.. మైనార్టీ సోదరులకు కాంగ్రెస్‌, బీజేపీ అక్రమ సంబంధం గురించి చెప్పాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. రాహుల్‌ అదానీని దొంగ అన్నారు.. రేవంత్‌ మాత్రం దొర అంటున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు