- బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా?
- బీఆర్ఎస్లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలి
- ప్రజలకు బహిరంగ క్షమాపణ చేప్పాలి.. ఆ తరువాతే ఓట్లడగాలి
- జరగబోయే ఎన్నికలు ధర్మానికి.. అధర్మానికి మధ్య
- ధర్మంగా ఎన్నికలను ఎదుర్కోలేని బిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు
- బీజేపీని ఎదుర్కోవడానికి ఏకమవుతున్న అధర్మ పార్టీలు
- కరీంనగర్ అసెంబ్లీలో బీజేపీ శక్తి చాటండి..
- గడపగడపకు వెళ్లండి..కాషాయ జెండా ఎగురవేద్దాం
- నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశంలో బండి సంజయ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీసీ వర్గాల ప్రజలను దారుణంగా అవమానించారు.. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన తరువాతే కేటీఆర్కు బీసీ కులం కంటే గుణం ముఖ్యమనే మాటలు గుర్తుకొచ్చాయా..? ‘గుణమే ముఖ్యమనే కేటీఆర్… బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ : జరగబోయే ఎన్నికలు ధర్మానికి అధర్మానికని, కరీంనగర్ అసెంబ్లీ లో బిజెపి ఒంటరిగా ధర్మబద్ధంగా పోటీ చేస్తుంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు బీజేపీని ఎదుర్కోవడానికి అధర్మ కలయికతో వస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్లోని ఈ.ఎన్ గార్డెన్స్లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్, శక్తి కేంద్రాల బాధ్యులు తగిన కార్యాచరణతో ముందుకు సాగాలని, రాబోయే 30 రోజులు పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేయాలన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బిఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారని, ఆ పార్టీల తీరు, పాలన తీరుతో ప్రజలంతా విసిగి పోయి ఉన్నారన్నారు. అందుకే నేడు బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలంతా నిశ్చయించుకున్నారన్నారు. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని ఇంటింటికి బీజేపీని విస్తృతంగా తీసుకువెళ్లాలనన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వ పనితీరును, రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్ఎస్ వైఫల్యాలను, కాంగ్రెస్, ఎంఐఎం రాజకీయ కుతంత్రాలు కుట్రలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పోలింగ్ బూత్ బాధ్యులు శక్తి కేంద్ర ఇన్చార్జులు సమిష్టి కృషి చేసి, కరీంనగర్లో కాషాయ జెండా ఎగరవేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యింది. ఆ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లే రాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీనిని బట్టి ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయమా? కాదా? తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు కేసీఆర్ చేతిలో ఉంది. కేసీఆర్ పంజరంలో కాంగ్రెస్ బందీగా మారింది. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో లొల్లి మొదలైంది. ఎప్పుడు చీలుతుందో అర్ధంకాని స్థితి. కేసీఆరే స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నడు. వాళ్లు గెలవగానే బీఆర్ఎస్ లోకి రాబోతున్నరు. కర్నాటకలో ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు. అక్కడి ప్రజలు తెలంగాణకు వచ్చి ధర్నాలు చేస్తున్నరంటే ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఇవన్నీ బయటపడతాయనే తెలిసి బీజేపీ గెలవకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నయ్. ఎన్నికల కమిషన్ ను సంప్రదిస్తాం. ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలని కోరుతున్నా. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీజేపీ బహిరంగ సభలు నిర్వహిస్తుంది. అందుకోసం పార్టీ నాయకత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. రుణమాఫీ అమలు కాలేదు. రైతులే కాదు నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలతోపాటు అన్ని వర్గాల పేదలు కేసీఆర్ పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ముఖ్యం.
ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ఇన్చార్జి మీసాల చంద్రయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి విటల్, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, మాజీ మేయర్ డి శంకర్ మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, మాజీ డిప్యూటీ మేయర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల రమేష్, కోమల ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సాయిని మల్లేశం, మంజులవాని, కార్పొరేటర్లు కోలగని శ్రీనివాస్, అనూప్, కాసర్ల ఆనంద్, పెద్దపెల్లి జితేందర్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, ఎడమ సత్యనారాయణ రెడ్డి, జానపట్ల స్వామి, ఊగలే సుధాకర్ పటేల్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, కరీంనగర్ జోన్, మండలాలఅధ్యక్షులు అవదుర్తి శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, పురం హరి ,పాదం శివరాజ్, మాడిశెట్టి సంతోష్ కుమార్, కడార్ల రతన్ కుమార్, కంచే శేఖర్, ఎండి ముజీబ్, ఎన్నం ప్రకాష్, బల్వీర్ సింగ్, గాయత్రి,బీజేపీ నాయకులు, వివిధ మోర్చాల బాధ్యులు,శక్తి కేంద్ర ఇన్చార్జులు సహాఇన్చార్జిలు బూత్ అధ్యక్షులు, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు..
బీజేపీ లోకి చేరిక ..
కరీంనగర్ పరిధిలోని 36, 48వ డివిజన్, రాంపూర్ ప్రాంతాల నుండి పలువురు యువకులతో పాటు టిడిపి సీనియర్ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ లు ఆదివారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆయా ప్రాంతాల నుండి వచ్చిన యువకులు నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.