- ఆ రెండు సీట్లు సీపీఎంకు ఇస్తేనే పొత్తు
- రేపటి లోపు సీట్ల సర్ధుబాటుపై తేల్చండి
- కాంగ్రెస్కు తేల్చిచెప్పిన తమ్మినేని వీరభద్రం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలతో జట్టు కట్టిన విషయం తెలిసిందే. అయితే.. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు చొప్పున సీట్లు కేటాయించేందుకు డీల్ కుదిరింది. ఇప్పటికే రెండు జాబితాల్లో 100 స్థానాలకు గానూ అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ.. ఈ రెండింట్లోనూ కామ్రేడ్లకు చోటివ్వలేదు కాంగ్రెస్. అయితే.. మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. కమ్యూనిస్టులు అడిగిన స్థానాలు ఆ ప్రకటించిన వాటిలో ఉండటం గమనార్హం. అయితే.. ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్తో పొత్తులపై స్పష్టంచేశారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్తో చర్చల్లో భాగంగా భధ్రాచలం, మిర్యాలగూడ, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం కోరినట్లు గుర్తుచేశారు. తమ పార్టీకి అక్కడ బలం ఉందని, ఇది వరకు కూడా పొత్తుల విషయంలో ఇతర పార్టీలతో కూడా అవే 5 స్థానాలు అడిగినట్లు స్పష్టంచేశారు. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా భద్రాచలం టికెట్ ఇవ్వడం కష్టమని చెబితే వదిలేసినట్లు వెల్లడించారు.
అయితే ప్రస్తుతం మిర్యాలగూడ, హైదరాబాద్ పరిధిలో ఒక సీటు ఇస్తామని కాంగ్రెస్ అంటుందని చెప్పారు. మరోవైపు మిర్యాలగూడలో సీపీఎం గెలవదని కాంగ్రెస్ అంటోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. మంగళవారం రోజు కాంగ్రెస్-సీపీఐ సమావేశం ఉంటుందని, భేటీలో సరైన నిర్ణయం రాకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు. రేపు సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించుకుంటామని, సీపీఎం ఎక్కడ పోటీ చేయాలో మరోసారి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పొత్తులపై కాంగ్రెస్కు సీరియస్నెస్ లేదని, మమ్మల్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని హితువుపలికారు.