Sunday, April 28, 2024

లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దం

తప్పక చదవండి
  • జనవరి మూడో తేదీ నుంచి సన్నాహక సమావేశాలు
  • తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు

పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా  జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో… మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.

మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. తేదీలవారీగా పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహాక సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి…

- Advertisement -
  • 3న ఆదిలాబాద్
  • 4న కరీంనగర్
  • 5న చేవెళ్ల
  • 6న పెద్దపల్లి
  • 7న నిజామాబాద్
  • 8న జహీరాబాద్
  • 9న ఖమ్మం
  • 10న వరంగల్,
  • 11న మహబూబాబాద్
  • 12న భువనగిరి 

సంక్రాంతి అనంతరం.. 

  • 16న నల్గొండ
  • 17న నాగర్ కర్నూలు
  • 18న మహబూబ్ నగర్
  • 19న మెదక్
  • 20న మల్కాజ్ గిరి
  • 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ 

ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల యంపిలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లాపార్టీ అద్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు. తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం  కసరత్తు చేస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు