Friday, May 3, 2024

బిసిల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదలచేస్తాం

తప్పక చదవండి
  • జనవరి 4నుంచి జయహో బిసి కార్యక్రమం నిర్వహణ
  • తెలుగుదేశం బిసిల పుట్టినిల్లు…న్యాయం చేసింది మేమే
  • టిడిపి-జనసేన మధ్య అద్భుత సమన్వయం ఉంది
  • వ్యూహం సినిమా నిర్మాత సిఎం జగన్మోహన్ రెడ్డే
  • నేను సజ్జల, రఘురామిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవాలా?
  • విలేకరుల సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

మంగళగిరి : రాష్ట్రంలో బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బిసి పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని టిడిపి జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… జయహో బిసి కార్యక్రమ నిర్వహణపై తొలుత చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఒక వర్క్ షాపు ఏర్పాటు చేసుకుంటాం. జనవరి 4వ తేదీనుంచి పార్లమెంటు, అసెంబ్లీ మండలస్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తాం. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఒక భారీ సభ ఏర్పాటుచేసి బిసి సోదరులకు మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించాం. యువగళం పాదయాత్రలో బిసి సోదరులు పడుతున్న ఇబ్బందులు నేను తెలుసుకున్నాను, నేను తిరగని మండలాల్లో కూడా జయహో బిసి ద్వారా సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
బిసిల పుట్టినిల్లు తెలుగుదేశం
బిసి సోదరులకు పుట్టినిల్లు టిడిపి, రాజకీయంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో బిసి సోదరులకు సీట్లు ఇచ్చి గెలిపించి కీలకశాఖలు ఇచ్చి గౌరవించారు. బిసి అంటే బలహీనవర్గం కాదు, బలమైన వర్గం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ 24శాతం రిజర్వేషన్ కల్పిస్తే, చంద్రబాబునాయుడు 34శాతానికి పెంచారు. గత ప్రభుత్వంలో బిసిలకోసం రూ.36వేల కోట్ల బిసిలకు ఖర్చుచేశాం, బిసి కార్పొరేషన్ ద్వారా 3వేల కోట్లు, ఆదరణ ద్వారా వెయ్యికోట్లు వెచ్చించాం. బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, విదేశీవిద్య, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి ఎన్నో పథకాలు అమలుచేశాం. చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులకు 50ఏళ్లకే పెన్షన్ ఇచ్చాం. శాసనసభలో తీర్మానం చేసి బిసి లకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరాం. 2019లో టిడిపి ఓడినా బిసిల కోసం సాధికార కమిటీలు ఏర్పాటుచేసి, వారి గళాన్ని విన్పించేందుకు వేదిక ఏర్పాటుచేశాం.
బిసిలను ఊచకోత కోసిన వైసిపి!
బిసి సోదరుల ద్రోహి జగన్. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చాక అనేకమంది బిసిలను అత్యంత అమానవీయంగా చంపేశారు. అమర్ నాథ్ గౌడ్ అక్కను వైసిపి నాయకులు వేధిస్తున్నారని చెబితే, ఆ బాలుడి పుస్తకం చించి కాగితాలను నోటిలో కుక్కి, పెట్రోలు పోసి కాల్చేశారు. ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి గానీ, వైసిపినేతలుగానీ కనీసం పరామర్శించలేదు. అమర్నాథ్ గౌడ్ ను హత్యచేసిన హంతకుడు బయట దర్జాగా తిరుగుతున్నాడు. నిందితుడ్ని వైసిపి నాయకులు ఊరేగించి ఇంటికి తీసుకెళ్లారు. పొద్దుటూరులో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోరాడినందుకు నందం సుబ్బయ్యను దారుణంగా నరికిచంపారు. ఆయన శవాన్ని చూడటానికి కూడా జనం భయపడ్డారు. సుబ్బయ్య భార్య అపరాజిత ఇప్పుడు న్యాయపోరాటం చేస్తోంది. శ్రీకాళహస్తిలో మునిరాజమ్మ అనే మహిళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎమ్మెల్యే ఆమె షాపును ధ్వంసం చేయించారు. కాళ్లు పట్టుకుంటే వదిలేస్తామని బెదిరించారు. వైసిపి పాలనలో కల్లుగీత కార్మికులు, స్వర్ణకారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు.
బిసిల భూములు కూడా కొట్టేశారు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్ ను 10శాతం తగ్గించారు, బిసిలకు చెందిన 8వేల ఎకరాల ఎసైన్డ్ భూములు కొట్టేశారు. ఆదరణ పథకం కింద గతంలో లబ్ధిదారులు చెల్లించిన 10శాతం డిపాజిట్ కూడా ఇవ్వలేదు, 56 కార్పొరేషన్లకు నిధులు, విధులు లేవు. బిసి కార్పొరేషన్ల డైరక్టర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జిఓ 217తో మత్స్యకారుల వెన్నవిరిచారు. చేనేతలు, పట్టురైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. బిసి సోదరులతరపున పోరాడుతున్న అనేకమంది బిసినాయకులపై తప్పుడు కేసులు బనాయించారు. యనమల రామకృష్ణుడు పెళ్లికి వెళ్లితే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు, అయ్యన్నపాత్రుడుపై రేప్ కేసు, అచ్చెన్న, కొల్లుపై తప్పుడు కేసులు మోపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.
బిసిల బ్యాక్ బోన్ అంటే వెన్నువిరవడమా?
మీడియా ప్రశ్నలకు లోకేష్ సమాధానమిస్తూ… ముఖ్యమంత్రి జగన్ బిసిలు బ్యాక్ బోన్ అంటూనే వారి వెన్నువిరిచే కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్ తగ్గించారు, కార్పొరేషన్లకు నిధుల్లేకుండా చేశారు. ఆదరణ పథకం ద్వారా ఒక్క పనిముట్టు ఇవ్వలేదు, ఆదరణ పథకాన్ని మూలనబెట్టారు, వారి ఎమ్మెల్యేలు తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని అంటున్నారు, జగన్ చెప్పే మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుంది. వైసిపి అధికారంలోకి వచ్చాక 26వేలమందిపై తప్పుడు కేసులు పెట్టించారు, పలువుర్ని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపించారు, ఇలా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. జగన్ ప్రభుత్వ అరాచకాలపై బిసి సోదరుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. శాసనసభ, శాసనమండలి, లోక్ సభ, రాజ్యసభలో అవకాశం ఇచ్చింది టిడిపి, టిటిడి, తుడా ఇచ్చి టిడిపి, అనేక పదవులు బిసిలకు ఇచ్చాం. ఇప్పుడు రెండుసార్లు టిటిడి పదవి ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో అందరికీ తెలుసు. వాస్తవాలు చర్చించేందుకు మేం రెడీ, కొల్లు రవీంద్ర చాలెంజ్ చేస్తే వారు ఎందుకు రాలేదు?
బిసిలకోసం ప్రత్యేక రక్షణ చట్టం!
పాదయాత్రలో నేను అనేక హామీలు ఇచ్చాను, బిసి సోదరులకు రక్షణకు ప్రత్యేక చట్టం, బిసిలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చాను, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా టెక్నాలజీతో అనుసంధానం చేసి యాప్ ద్వారా సర్టిఫికెట్ అందుబాటులోకి తెస్తాం. ఉపకులాల వారీగా నిధులు కేటాయించి, ఆ నిధులను వారి స్వయం ఉపాధి, సంక్షేమం కోసం ఖర్చుచేస్తాం, బిసి సోదరులకు దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు కేటాయిస్తాం. విదేశీవిద్య, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ వంటివి పునరుద్దరిస్తాం. స్థానిక సంస్థల్లో తగ్గించిన 10శాతం రిజర్వేషన్ మేము వచ్చాక తిరిగి కల్పిస్తాం. పాదయాత్రలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం ఇప్పటివరకు పలు హామీలు ఇచ్చాం, 2నెలలపాటు నిర్వహించే జయహో బిసి కార్యక్రమం ద్వారా వారి సమస్యలు తెలుసుకొని, పూర్తిస్థాయిలో వారికి భరోసా ఇస్తాం.
చిత్తశుద్ధి ఉంటే గెలిచే సీట్లు ఇవ్వాలి
జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే సీట్లన్నీ బిసిలకు ఇస్తున్నారు, గెలిచే సీట్లు వారి సామాజికవర్గీయులకు ఇచ్చుకుంటున్నారు. మంగళగిరిలో రెండుసార్లు ఆర్కే గెలిచారు, ఇప్పుడు పరిస్థితులన్నీ పూర్తిగా అడ్డం తిరిగే సరికి బిసి పేరుతో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారికి నైతికహక్కు ఎక్కడుంది? నాడు-నేడు ఎల్లప్పుడూ బిసి సోదరులకు ప్రాధాన్యత ఇచ్చింది టిడిపినే. చట్టసభల్లో ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కౌన్సిల్, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బిసిలకు ప్రాధాన్యతనిస్తాం. మంత్రి విడదల రజనిని గుంటూరు వెస్ట్ కి మార్చారు. గత ఎన్నికల్లో వేవ్ లో కూడా అక్కడ వైసిపి గెలవలేదు, నిజంగా జగన్ కు చిత్తశుద్ధి ఉంటే సొంత బంధువును కాదని కడప పార్లమెంటు టిక్కెట్ ఇవ్వమనండి, పులివెందుల సీటు బిసిలకు ఇవ్వమనండి. ఓడిపోయే సీట్లు ఇస్తే ఆయనను ఎవరు నమ్ముతారు. గతంలో గెలిచిన చిలకలూరిపేట టిక్కెట కాదని, రజనిని ఇప్పుడు వెస్ట్ కు ఎందుకు మార్చారు?
బస్సు యాత్రలతో ఉపయోగమేంటి?
పాదయాత్రలో బిసి సోదరులకు పలు హామీలు ఇచ్చాను, వాటికి కట్టుబడి ఉన్నాం. మత్స్యకారులకు గొడ్డలిపోటుగా ఉన్న 217 జిఓ మొదటి వందరోజుల్లో రద్దుచేస్తామని చెప్పా. ఉపకులాల వారీగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎలా పరిష్కరిస్తామో చెప్పాము, బిసిల గళాన్ని విన్పించేందుకు 54 సాధికార కమిటీలు గతంలోనే వేశాం. ఉపకులాల వారీగా నాయకత్వాన్ని ప్రోత్సహించాం, ఆ కమిటీలు కూడా కొన్ని వివరాలు సేకరించాయి, వాటిని మ్యానిఫెస్టోలో పెడతాం. వైసిపి హయాంలో ఒక్క బిసి సోదరుడికి లోన్ ఇచ్చానని నిరూపించమనండి. లోన్లు ఇవ్వరు, పనిముట్లు ఇవ్వరు, తరతరాలుగా మత్స్యకారుల చేతిలో ఉన్న చెరువులు పెత్తందారులకు ఇస్తారు. ఎప్పుడు లేనివిధంగా దళితులపై దాడులు జరుగుతుంటే సిఎం ఒక్కసారైనా నోరువిప్పారా? డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, ఓంప్రతాప్, అనితారాణి పై దాడిచేస్తుంటే ఏంచేశారు? హోంమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత యువకుడ్ని చంపుతుంటే ఏమి చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక బస్సుయాత్రల వల్ల ఉపయోగం ఏంటి?
బటన్ ఏమైనా జగన్ కనిపెట్టాడా?
ముఖ్యమంత్రి జగన్ బటన్ పై తనకే పేటెంట్ ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాడు. బటన్ ఏమైనా జగన్ కనిపెట్టాడా? 2009లో టిడిపి మ్యానిఫెస్టోలో డిబిటి ఉంది, 2014లో కొన్ని పథకాల్లో ఈ విధానాన్ని అమలుచేశాం. బిసి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి రొటీన్ గా ఇచ్చే పెన్షన్లు, అరకొర ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. వైసిపి వచ్చాక బిసిలకు ఒక్క లోన్ ఇవ్వలేదు. దళితులకు మేం అమలుచేసిన 27సంక్షేమ పథకాలు రద్దుచేశారు. రాష్ట్రంలో ఒక్క కమ్యూనిటీ భవనం పూర్తిచేయలేదు, మేం 80శాతం పూర్తిచేసిన వాటినికూడా, మిగిలిన 20శాతం చేయలేకపోయారు.
సజ్జల, రఘురామిరెడ్డి స్క్రిప్ట్ చదవాలా?
ఏ అధికారి అయితే చట్టాన్ని ఉల్లంఘించాడో వారిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి, డిస్మిస్ చేస్తామని నేను బహిరంగసభలో చెప్పాను. ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదు. నేను ఏం మాట్లాడాలో సిఐడివాళ్లు నాకు చెబుతారా? ఒక పనిచేయమనండి. సజ్జల రామకృష్ణారెడ్డి, రఘురామిరెడ్డి, సీతారామాంజనేయులు స్క్రిప్ట్ పంపించమనండి, అదే చదువుతాను. ప్రజాస్వామ్యంలో మా అభిప్రాయాన్ని చెప్పే హక్కులేదా? ఏ అధికారిని అయితే చట్టాన్ని ఉల్లంఘించారో అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పాను, ఆ మాటలకు కట్టుబడి ఉన్నా. అందుకే రఘురామిరెడ్డి, సీతారామాంజనేయులు నాన్ బెయిలబుల్ వారెంటు ఇస్తారా? సిఐడి విచారణ సందర్భంగా రెండురోజులు నన్ను అడిగిన ప్రతిప్రశ్నకు సమాధానమిచ్చా. నేను ఎర్రబుక్కు పేరు చెబితే వారు ఉలిక్కి పడుతున్నారు, ఎర్రబుక్కులో ఎవరిపేర్లు ఉన్నాయో వారికెలా తెలుసు? చట్టాన్ని ఉల్లంఘించామని రఘురామిరెడ్డి, సీతారాంజనేయులు ఒప్పుకుంటున్నారా? చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసి ఇప్పుడు భయపడుతున్నారు. వారి పేర్లు రెడ్ బుక్ లో పెట్టానని నేను ఎక్కడా చెప్పలేదు. తప్పుచేసిన వారే నా మాటలకు భయపడాలి. వారు తప్పుచేశారో , లేదో వారే తేల్చుకోవాలి.
జగన్ ప్రోద్భలంతోనే వ్యూహం సినిమా
ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లడం, సినిమాలు తీయడం కొందరికి అలవాటుగా మారింది. వ్యూహం సినిమా బడ్జెట్ అంతా సైకో జగన్ దే. ఇప్పటికే ఆ సినిమా డైరక్టర్ రెండుమూడుసార్లు జగన్ ను కలిశారు. రాంగోపాల్ వర్మ తరపున న్యాయపోరాటం చేస్తున్న లాయర్ వైసిపి రాజ్యసభ సభ్యుడు. ఆయన తెలంగాణా హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? దీని వెనుక ప్రభుత్వం ఉంది. సినిమా తీయాలంటే హు కిల్డ్ బాబాయ్, కోడికత్తి, ప్యాలెస్ కుట్రలపై తీయవచ్చు. లేనిది ఉన్నట్టు చూపితే మేం పోరాడతాం. మాకు ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది. స్టేట్, సెంట్రల్ సెన్సార్ బోర్డులకు లేఖలు రాశాం పట్టించుకోలేదు, అందుకే కోర్టుకెళ్లాం, న్యాయస్థానంలో వచ్చే తీర్పును బట్టి ముందుకు వెళ్తాం.
చెత్త పక్కింట్లో వేస్తే బంగారం అవుతుందా?
మన ఇంట్లో చెత్త పక్క ఇంటి ఎదుట వేస్తే బంగారం అవుతుందా? చిలకలూరిపేటలో చెత్త అని తేల్చిన వ్యక్తిని గుంటూరు వెస్ట్ లో వేస్తే బంగారం అవుతుందా? ప్రజలు ఈ విషయన్ని గమనించరా? అద్ధుతమైన అభ్యర్థి అయతే అక్కడే పెట్టాలి కదా? చెత్త ఎక్కడైనా చెత్తచెత్తే. మంగళగిరిలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కార్పొరేషన్ ఎన్నికలు జరపలేదు, ఎమ్మెల్యే ఈ పార్టీ ఇక ఉండదని వదిలేశారు. ఇప్పుడు జనం ఇబ్బంది పడుతున్నారు. మరో 3నెలల్లో ఈ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయం, మంగళగిరిని నేను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా.
జనసేనతో అద్భుత సమన్వయం ఉంది
జనసేన పార్టీతో మాకు అద్భుతమైన సమన్వయం ఉంది, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో మావారితో జనసైనికులు కలిసి తిరుగుతున్నారు, లేదని మీరు ఎలా చెబుతారు? పండుగ తర్వాత మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. ఎన్నికల షెడ్యూలు ఎనౌన్స్ చేశాక అభ్యర్థులను ఎంపికచేస్తాం, అంతర్గతంగా చాలామందికి పనిచేసుకోమని అధ్యక్షుడు చెప్పారు, సరైన సమయం అభ్యర్థులను అధ్యక్షులు ప్రకటిస్తారు. రాష్ట్రంలో అనేకమంది ఉద్యోగులు తమ డిమాండ్లపై రోడ్డెక్కుతున్నారు. అంగన్ వాడీ, విద్యుత్, ఎస్ఎస్ఎ, ఆరోగ్య శ్రీ ఉద్యోగులు… ఇలా ప్రతిఒక్కరూ రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. వైసిపి ప్రభుత్వం దివాలా తీసింది, డబ్బుల్లేవు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను మా ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తాం. గతంలో చెప్పకపోయినా అంగన్ వాడీల జీతాలు పెంచాం, అధికారంలోకి వచ్చాక అంగన్ వాడీలను ఆదుకుంటామని స్వయంగా హామీ ఇచ్చాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు