- ఇద్దరు వ్యక్తుల అరెస్టు, మిగతావారికోసం గాలింపు
- రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి వెల్లడి
మొయినాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారినుంచి సుమారు 100 కేజీల గంజాయి ప్యాకెట్లను మొయినాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా శుక్రవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ డిసిపి రష్మీ పెరుమాళ్, చేవెళ్ల ఏసిపి ప్రశాంత్ రెడ్డి, మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రంగాతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.ఒరిస్సా రాష్ట్రం నుంచి నగరంలోని దూలిపేటకు గంజాయి తరలిస్తున్న ముఠాను మొయినాబాద్ పోలీసులు నార్కోటిక్ పోలీసు సిబ్బందితో కలిసి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని సురంగల్ గ్రామ రెవెన్యూలోగల ఏఎంఆర్ వెంచర్ లో అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు సురంగల్ లోని ఏఎంఆర్ వెంచర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటివద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు వారిని వెంబడిరచారు. నిందితులు భయపడి పరుగులు తీయడంతో సిబ్బంది వారిని వెంటబడి పట్టుకున్నారు. అందులో ఒకరు బావర్ ఖాన్, నితీష్ సింగ్ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని మనోజ్ వద్ద నుంచి ఈ నెల 13వ తేదీన రెండు కేజీల చొప్పున ఉన్న 50 ప్యాకెట్లు ( సుమారు 100 కిలోలు ) కారులో తరలించినట్లు తెలిపారు. నగరంలోని దూల్పేటకు చెందిన సునీల్ సింగ్ కు పాకెట్లు ఇవ్వాలని కోరగా.. అక్కడే ఉన్న కారుతో పాటు స్కూటీపై ఉన్న నితీష్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 కిలోల గంజాయితో పాటు కారు, స్కూటీ, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరినీ అరెస్టు చేయడం జరిగింది. మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో మొయినాబాద్ తహశీల్దార్ గౌతమ్ కుమార్, అర్ఐ చెంద్రమోహన్, ఎస్సై లు కిషన్ సింగ్, రామ్ చందర్, హెడ్ కానిస్టేబుల్ దేవిసింగ్, వినోద్ కుమార్, కానిస్టేబుల్ రాజు, నర్సింహ సత్తయ్య లు తదితరులు పాల్గొన్నారు.