- అధికార కార్యాలయాల ముందే పారుతున్న మురుగునీరు.
- మున్సిపల్ కమిషనర్, ఉన్నట్టా… లేనట్టా…?
- గత కొన్ని రోజుల నుంచి లీక్ అవుతున్న అండర్ డ్రైనేజ్.
కొత్తూరు(ఆదాబ్ హైదరాబాద్): సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయాల ముందే అండర్ డ్రైనేజీ లీక్ అయ్యి మురుగునీరు పారుతున్న పట్టించుకునే నాధుడే కరువైయాడని అధికారులు కార్యాలయాలకు వచ్చిన ప్రజలు హవ్వా, సిగ్గు.. సిగ్గు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా మురుగునీరు పారుతున్న విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి వెళ్లలేదా అసలు వారు ఉన్నట్టా.. లేనట్టా అని ప్రజలు చర్చించుకోవడం గమనర్హం. కొత్తూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు వెళ్లే దారి నుంచి కొత్తూరు మండల ప్రాదేశిక కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాల ముందు ఉన్న అండర్ డ్రైనేజీ లీక్ కావడంతో మురుగునీరు రోడ్డు పైకి చేరి దుర్గంధమైన వాసన వెదజల్లుతుంది. మండలంలోని అతి కీలక బాధ్యతలు పోషించే ఎంపీడీవో, తహసిల్దారు కార్యాలయాల వద్ద ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటే మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి ఏ దశలో ఉందని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు అండర్ డ్రైనేజీ లీకు తీరుని చూసి నివ్వెర పోతున్నారు. కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందని ఉపన్యాసాలు ఇచ్చే నాయకులకు ఇది కనిపించడం లేదా అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఇటీవలే మూడు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో కొత్త మున్సిపాలిటీ భవనాన్ని అంగరంగ సుందరంగా నిర్మించుకున్న మున్సిపాలిటీ అధికారులకు స్థానిక తహసిల్దారు, ఎంపీడీవోల కార్యాలయాల వద్ద ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్ళముందే ఇట్టే కనిపిస్తుంది.పారుతున్న మురుగు నీరుపై దోమలు, ఈగలు చేరడంతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని సమీపంలోని కాలనీవాసులు ఆందోళనలు చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల తోపాటు కాలనీవాసులు కోరుతున్నారు.
- ఎమ్యెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టి సారించాలి…
షాద్ నగర్ నూతనంగా ఎమ్యెల్యే గా ఎన్నికైన వీర్లపల్లి శంకర్ కొత్తూరు మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ పరిధిలోని ప్రజలు కోరుతున్నారు. ఎమ్యెల్యే వీర్లపల్లి శంకర్ స్థానిక మున్సిపల్ కమిషనర్ తో అభివృద్ధి పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు చర్చించుకోవడం కొసమెరుపు.