- పోటీ చేయోద్దని ఎవరైన భయపెట్టారా.. ?
- బాబే పోటీ అంటే భయపడుతున్నారా .. ?
- తెలుగుదేశం ప్రాంతీయ పార్టీయా.. జాతీయ పార్టీయా..? పోటీకి నో అంటున్న బాబు, లోకేష్లపై టీటీడీపీ నేతల కన్నెర్ర
- ప్రస్తుతానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ షెట్టర్ క్లోజ్? కాసానిని బాబు నిండాముంచేశారని వినబడుతున్న మాటల్లో నిజమెంత?
- గతంలో వేరే పార్టీలో చేరితే జ్ఞానేశ్వర్, వీరేశ్కు మంత్రి పదవులే దక్కేవి పోటీ చేయకపోతే టీడీపీ నాయకుల, కార్యకర్తల భవితవ్యం ఏంటి..?
- తెలుగు తమ్ముళ్లకు బాబు, లోకేశ్లలో ఎవరు సమాధానం చెబుతారు? పోటీ చేయకపోతేనే బాబుకు బెయిల్ వస్తుందన్న మాటల్లో నిజమెంత ?
- ` అధినేతకు, వారి కుటుంబ సభ్యులకు పనిగట్టుకుని కల్పితాలు చెప్పిన కా…… నేత ఎవరు..?
(తెలంగాణ టీడీపీ భవిష్యత్తేంటి.. ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం ‘‘వాసు’’ పొలిటికల్ కారెస్పాడెంట్)
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం పేరిట ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో కూడా టీడీపీ జెండాను ఎత్తుకుని నిలబడ్డ 40 ఏండ్ల రాజకీయ చాణక్యుడు ఎందుకు ఇప్పుడు డీలా పడిపోయారు. మడమ తిప్పేది లేదు .. మాట తప్పేది లేదు అన్న సీనియర్ లీడర్ ఎందుకు మౌన మునిలా మారిపోయారు.. ? తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేయాలనీ కాసాని జ్ఞానేశ్వర్, కాసాని వీరేశ్లను ప్రోత్సహించిన చంద్రబాబు, లోకేశ్ లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయకూడదని ఎందుకు భీష్మించుకుని కూర్చున్నారు.? ఎవరయిన చంద్రబాబును, లోకేశ్ను భయపెట్టారా.. ? లేక చంద్రబాబే పోటీ చేయడానికి భయపడుతున్నారా.. ? అనేది తేలని..తేల్చుకోలేని మిలియన్ డాలర్ల ప్రశ్నగా తెలంగాణ తెలుగు తమ్ముళ్లను వేధిస్తోంది ? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతుంటే.. మరో వైపు కొన్ని పార్టీలు మాత్రం ఇంకా.. పోటీ చేయాలా వద్దా అన్న డైలామాలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ కోవకే చెందిన పార్టీగా టీటీడీపీ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో సామాన్యులకు సైతం టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పార్టీ ఇప్పుడు పోటీ అంటే ఎందుకు జంకుతోందో తెలియడం లేదు.? నిన్నటి వరకు పోటీలో ఉంటామని ఊరిస్తూ వచ్చిన టీడీపీ అదినాయకత్వం.. ఇప్పుడు ఎవ్వరు ఊహించని విధంగా తెలంగాణ తెలుగు తమ్ముళ్ల నమ్మకాన్ని వమ్ముచేస్తూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం ప్రకటించింది ..ఉన్నది లేనిది అరువు తెచ్చుకుని 20 ఏండ్లుగా పార్టీని నమ్ముకుని పరుగులు తీసిన తమ్ముళ్లు పోటీ చేయలేమనే నిర్ణయాన్ని జీర్ణించుకోలేక టీడీపీ అధినాయకత్వంపైనే తిరగబడుతున్నారు..
పోటీకి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించాలన్న బాబు..
అక్టోబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయిన విషయం తెలిసిందే.. అయితే ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల మీద దృష్టి పెట్టలేమని బాబు తెగేసి చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు ములాఖత్ అయిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడిన కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. వీలైనన్ని స్థానాల నుంచి బరిలోకి దిగుతామంటూ చెప్పుకొచ్చారు కూడా, అయితే నారా లోకేశ్ తో భేటీ అనంతరం ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలన్నది నిర్ణయిస్తామని కాసాని తెలిపారు. కానీ.. ఆదివారం జరిగిన సమావేశంలో పోటీ చేయట్లేదని తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు చావు కబురు చల్లగా చెప్పేశారు కాసాని జ్ఞానేశ్వర్. అయితే.. పోటీకి నో అంటున్న బాబు, లోకేష్లపై టీటీడీపీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. ఏండ్లుగా పార్టీకోసం సర్వం దారపోశామని.. ఇప్పుడు వద్దు అంటే ఎలా కుదురుతుంది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
తెలుగుదేశం ప్రాంతీయ పార్టీయా .. లేక జాతీయ పార్టీయా ..?
బీజేపీ దేశంలో రెండు స్థానాలలో మాత్రమే గెలిచి నేడు జాతీయ స్థాయిలో ఎదిగిన విషయాన్నీ టీటీడీపీ నేతలు మరోసారి గుర్తు చేస్తున్నారు.ఎన్నికల్లో పోటీ చెయ్యనప్పుడు ఇక రాజకీయ పార్టీ అని పిలిపించుకోవడం దేనికని ప్రశ్నిస్తున్నారు. గెలవడం ఓడిపోవడం రాజకీయ పార్టీలకు సర్వసాధారణమైన విషయమని.. ఓడిపోతామని భ్రమపడటం ఆ భ్రమలను నాయకులకు, కార్యకర్తలకు ఆపాదించడం,అంటగట్టడం తగదని సూచిస్తున్నారు. ఎవ్వరో కొందరి చెప్పుడు మాటలు విని తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ని నాశనం చేయడం తగదని అంటున్నారు. ఒక ఏపీలో గెలిస్తే సరిపోతుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తే ఇక తెలంగాణాలో పార్టీని నడపడం ఎందుకని తెలుగు తమ్ముళ్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ షెట్టర్ క్లోజ్ ?
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన టీడీపీలో ఇప్పుడు ఎన్నికల జోష్ కనుచూపుమేర కనిపించడం లేదు. పోటీకి పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక నో అంటారా? అనే అంశంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది..?ఒక వేళ టీడీపీ తెలంగాణాలో పోటీ చేయకపోతే ప్రత్యామ్నాయమేంటి? పోటీ లో నిలబడకపోతే టీడీపీ ఏ పార్టీకి మద్దత్తు ఇస్తుంది ?తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నే కాదు టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్న ప్రశ్నలివే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి చంద్రబాబు నో చెబితే ఇక టీడీపీని వీడి.. మరో పార్టీలో చేరేందుకు కాసాని రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి టీడీపీ ని కాదని గతంలో వేరే పార్టీలో జ్ఞానేశ్వర్,వీరేశ్ లు చేరితే వారికీ మంచి పదవులే దక్కేవి ..?కానీ చంద్రబాబు మీద నమ్మకంతో జ్ఞానేశ్వర్, వీరేశ్లు టీడీపీ లో చేరి తమ ప్రతిష్టకు మచ్చతెచ్చుకున్నారని స్వంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు..
కాసానిని బాబు నిండాముంచేశారని వినబడుతున్న మాటల్లో నిజమెంత ..?
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్వయంగా కుత్బుల్లాపూర్ నుంచి.. ఆయన తనయుడు పరిగి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే టీడీపీకి సానుభూతి ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు ఓ పది, పదిహేను వరకు ఉంటాయి. ఆయా నియోజకవర్గాల్లోనైనా పోటీ చేసి సత్తా చాటాలని కోరుకుంటోంది క్యాడర్. కానీ.. అధినేత అందుబాటులో లేకపోవడం, ప్రచారం.. ఇతర ఎన్నికల ఏర్పాట్లపై స్పష్టత లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే మేలని పార్టీలోని ఓ కా …. వర్గం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.నిజానికి అభ్యర్ధుల ఎంపిక, పొత్తులు, మ్యానిఫెస్టో వంటి అంశాలన్నింటిపైనా చంద్రబాబే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అభ్యర్ధులకు కాసాని బీఫామ్ ఇవ్వాలంటే.. ముందు ఆయనకు చంద్రబాబు ఏ ఫామ్ ఇవ్వాల్సిఉంటుంది. కానీ చంద్రబాబు జైల్లో ఉండటం.. ఆయనతో ములాఖత్కు కుదరడం లేదని చెబుతున్నారు. చంద్రబాబుకు పరిమితమైన ములాఖత్లనే జైలు అధికారులు అనుమతిస్తున్నారు. ఈ ములాఖత్ల్లో న్యాయవాదులు, కుటుంబ సభ్యులు.. ఇంకా అత్యవసరమైతే ఏపీలోని ముఖ్య నాయకులే కలుస్తున్నారు.దీంతో టీటీడీపీ అధ్యక్షుడు కాసానికి మాత్రం బాబుతో ములాఖత్ కు చాన్స్ దొరకడం లేదు. ఇక చంద్రబాబు అనారోగ్య కారణాలతో ఎన్నికలకు ముందు విడుదలైనా ప్రచారం చేసే పరిస్థితి లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే మేలన్న వాదన వినిపిస్తోంది.
ఇక్కడవరకు బాగానే ఉన్నా .. ..
పార్టీలోని కాసాని వర్గం టీడీపీ అధినాయకుల అభిప్రాయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటివరకు కోట్లు కుమ్మరించి పార్టీని నిలబెట్టి నాయకులకు, కార్యకర్తలకు ఓ భరోసా వచ్చాక తూచ్ .. పోటీ చేయమంటే ఎలా కుదురుతుంది అంటున్నారు. ఇప్పటికయిన చంద్రబాబు, లోకేశ్ లు తెలంగాణ నాయకుల, కార్యకర్తల అభిప్రాయం మేరకు పోటీ చేసే అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
గతంలో వేరే పార్టీలో చేరితే జ్ఞానేశ్వర్,వీరేశ్ లకు మంత్రి పదవులే దక్కేవి ..?
నిజానికి ముదిరాజ్ సామాజిక వర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ ఆయన కుమారులు కాసాని వీరేశ్ లు మంచి పేరున్న నాయకులు, టీడీపీ కాకుండా వీళ్ళు అధికార పార్టీలో చేరితే మంత్రి పదవులే దక్కేవని పార్టీలో ఓ వర్గం బలంగా వాదిస్తోంది . వీరిద్దరు బాబు ని టీడీపీ ని నమ్ముకుని తమ విలువైన సమయాన్ని, ఆస్తులను అమ్ముకుని గట్టిగా మోసపోయారని చర్చించుకుంటున్నారు.. నిజానికి ఇంత ఖర్చు పెట్టి టీడీపీ లాంటి పార్టీని నడిపే నాయకులు (జ్ఞానేశ్వర్,వీరేశ్ ) టీటీడీపీకి భవిష్యత్తులో దొరకరన్నది వాస్తవం. అయిన బాబు మీద పూర్తినమ్మకం తో జ్ఞానేశ్వర్,వీరేశ్ లు ముందుకుసాగి అన్యాయానికి గురవ్వడాన్ని టీటీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతుంది.
తెలంగాణా తెలుగు తమ్ముళ్లకు బాబు, లోకేష్ లలో ఎవరు సమాధానం చెబుతారు?
తెలంగాణాలో పోటీకి విముఖత చూపడంపై తెలుగు తమ్ముళ్లు బాబు, లోకేశ్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ఆయన కుమారులు కాసాని వీరేశ్ లు ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉంటామని తేల్చి పారేశారు. ఐతే తెలంగాణాలో టీడీపీ పోటీ ఫై ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్.. దీంతో చంద్రబాబు ఏమంటారన్న ఆంశంపైనే సర్వత్ర ఉత్కంఠ నెలకొంది . ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే.. తన వయసు.. ఆరోగ్యం దృష్ట్యా వచ్చే ఎన్నికల వరకు వేచిచూడాల్సిరావడం కష్టమని.. కుమారుడికి తన రాజకీయ వారసత్వం ఇవ్వాలంటే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడంతోపాటు తన కుమారుడిని ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం ఉందని కాసాని జ్ఞానేశ్వర్ బలంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన ముందున్న అనేక ప్రత్యామ్నాయాలను జ్ఞానేశ్వర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.. అందులో భాగంగా టీడీపీకి గుడ్బై చెప్పి.. ఇతర పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయడమన్న ప్రతిపాదన ఉండటంతో తెలంగాణ టీడీపీలో కలకలం రేగుతోంది.