- మరోసారి చీర్యాల గ్రామంలో హడావుడి చేసిన అధికారులు
- అక్రమ నిర్మాణాల కట్టడి జరిగేనా?
- అమాయక ప్రజలు మోసపోకుండా ఉండేనా?
కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు మరోసారి హడావుడి చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో చేపడుతున్న అక్రమ నిర్మాణా లను బుధవారం అధికారులు కూల్చివేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం సహాయంతో అనుమతులు లేకుండా భారీగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను, గ్రామంలోని పెద్ద చెరువు బఫర్ జోన్లో చేపట్టిన నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు. కూల్చివేతలలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫోర్జరీ సంతకాలతో నిర్మాణ అనుమతులు
గత పాలకవర్గ సమయంలో ఫోర్జరీ సంతకాలతో నిర్మాణ అనుమతులు ఇవ్వడంతో బిల్డర్లు యధేచ్ఛగా నిర్మాణాలను చేపట్టి అమాయక ప్రజలకు అంటగట్టారు. సరైన అనుమతులు లేవని తెలియక చీర్యాల గ్రామంలో ఇండ్లను కొనుగోలు చేసిన వారు నిత్యం గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇండ్లను కొనుగోలు చేసే ముందు గ్రామ పంచాయతీలో సంప్రదించి, అనుమతులు ఉన్నాయో లేవో తెలుసుకొని మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇండ్ల కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేనా?.. ఇప్పటికే పలుమార్లు చీర్యాల గ్రామంలోని అక్రమ నిర్మాణాలపైన అధికారులు చర్యలు చేపట్టినా కూడా అనుమతులు లేని అక్రమ కట్టడాల కట్టడి జరగలేదు. ఇప్పటికైనా చీర్యాల గ్రామంలో అక్రమ నిర్మాణాల కట్టడి జరిగి, పైసా పైసా కూడబెట్టి చీర్యాల గ్రామంలో ఇండ్లను కొనుగోలు చేస్తున్న వారు మోసపోకుండా ఉండేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారో లేక అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తారో వేచి చూడాలి.