- రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ
- ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ
- 29న పోలింగ్.. సాయంత్రం ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. గురువారం ఉదయం అసెంబ్లీ కార్యాలయం ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. నేటి నుంచి ఈనెల 18 వరకు నామినేషన్లకు గడువు. ఈనెల 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. జనవరి 29న ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నిక జరుగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం కౌంటింగ్.. ఫలితం వెలువడనుంది. కాగా.. స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ ఈ రెండు స్థానాలను గెల్చుకునే అవకాశం ఉంది. అయితే ఎవరిని పోటీలోకి దింపుతారన్నది చూడాలి. పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ప్రయత్నంలో ఉన్నారు.