- కాళేశ్వరంలో కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి
- ప్రాజెక్టుపై 168 పేజీల కాగ్ రిపోర్టు
- కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ నివేదికలో వెల్లడి
- ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టిన కాగ్
హైదరాబాద్ : లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయం.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు.. పెద్ద ఎత్తున అవినీతి.. అంతకుమించి నిధుల గోల్మాల్ ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇది ఒక ఆరోపణ మాత్రమే. ఇది నిజమని నమ్మినవారు ఉన్నారు.. కేవలం ఆరోపణ అని కొట్టిపారేసినవారు ఉన్నారు.అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటి ప్రభుత్వం చెబుతుంది నిజామా..లేక గత ప్రభుత్వం చెప్పేది నిజామా.. అసలు నిజాన్ని కాగ్ 168 పేజీల డ్రాఫ్ట్ రిపోర్టుతో బహిర్గతం చేసింది.. కాళేశ్వరం ప్రాజెక్టు కొందరు అధికారులకు, మరికొందరు రాజకీయ నాయకులకు ఏటీయం మిషన్ గా మారిందని విమర్శించిన వారూ ఉన్నారు. ఇది కేవలం అతిశయోక్తి అని కొట్టి పడేసినవారూ ఉన్నారు. అయితే ఇప్పుడు కాళేశ్వరం అవినీతి జరిగిందన్నది ముమ్మాటికీ వాస్తవమని నిర్ధారనైంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలను కాగ్ ఎండగట్టింది.
అనుమతికి ముందే పనులు ఎలా ప్రారంభం అయ్యాయి..
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ 168 పేజీల డ్రాఫ్ట్ రిపోర్టు విడుదల చేసింది.. ఈ రిపోర్టు ద్వారా ప్రాజెక్టు అవినీతిని కాగ్ తీవ్రంగా ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును 2018 జూన్ లో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించగా.. ఆశ్చర్యకరమైన రీతిలో అనుమతికి ముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన వివిధ పనులను కాంట్రాక్టర్ లకు కేటాయించినట్లు కాగ్ రిపోర్టులో ప్రస్తావించారు.ఇలా చేయడం ద్వారా డిపీఆర్ ను అసలు పట్టించుకోకుండానే పనులు ప్రారంభించడం వెనుక ఏదో మర్మం ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడే పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మాణ వ్యయం భారీగా పెరిగినట్లు కాగ్ గుర్తించింది
సిడబ్ల్యూసీ సూచనలకు విరుద్దంగా 2019 జూన్ నుండి 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో టీఎంసీని ఎత్తిపోసే మోటర్లు, పంపులను సమకూర్చాలంటూ 28వేల151 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను నిర్మాణ సంస్థలకు గత ప్రభుత్వం ఇచ్చిందని కాగ్ పేర్కొంది. దీనికి ఏ మాత్రం శాస్త్రీయత, సహేతుకత లేదని తేల్చి చెప్పింది.దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా నిర్మాణవ్యయం మాత్రం భారీగా పెరిగినట్లు కాగ్ గుర్తించింది. ఈ మూడో టీఎంసీ నిర్మాణ ప్యాకేజీల్లో అత్యధిక భాగాన్ని ఒకే కంపనీ దక్కించుకోవడంఫై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇఫ్పుడు కాళేశ్వరం అవినీతి మొత్తం ఆ కంపెనీ చుట్టే తిరుగుతోంది.
రూ.లక్షా రెండు వేల కోట్లకు వ్యయం..
అవసరం లేకపోయినా చేపట్టిన వివిధ పనుల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం లక్షా రెండు వేల కోట్ల రూపాయలకు చేరిందని కాగ్ నివేధికలో పేర్కొంది. అయితే డిపిఆర్ లో మాత్రం ప్రాజెక్టు వ్యయం కేవలం 63 వేల కోట్లుగానే నిర్ధారించారు. అవసరం లేని పనుల వల్లే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచారని కాగ్ గుర్తించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం లక్షా 49 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని కాగ్ రిపోర్టులో పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 73 శాతం వరకు రుణాల రూపంలోనే ప్రభుత్వం సమకూర్చుకుందని కాగ్ తన రిపోర్టులో వెల్లడిరచింది.
వివిధ సంస్థలకు కాంట్రాక్టులు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ దశల్లో మొత్తం 56 వర్క్ కాంట్రాక్టులను వివిధ సంస్థలకు ఆప్టిప్రభుత్వం అప్పగించింది. ఇందులో ఇపీసీ ప్రాతిపదికన ఇచ్చిన 17 పనుల విలువ 30 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉండగా . మిగిలిన 39 పనులను గంపగుత్తగా యూనిట్ ప్రైస్ ప్రాతిపదికన ఇచ్చేశారు. దీని విలువ ఏకంగా 52 వేల కోట్ల రూపాయలు కావడం గమనార్హం. యూనిట్ ప్రైస్ ప్రాతిపదికగా ఇచ్చిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇరిగేషన్ శాఖ వెల్లడిరచలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇక ఈ మొత్తం కాంట్రాక్టుల్లో 21 కాంట్రాక్టులు లిఫ్ట్ పంపుసెట్ల సరఫరాకు సంబధించినవే కాగా.. ఇందులో అత్యధిక భాగం పనులను ఒకే సంస్థ దక్కించుకుంది. ఇందులోని నాలుగు ప్యాకేజీల్లో పంపుసెట్లకు సంబంధించి అయా కాంట్రాక్టర్లకు ప్రభుత్వరంగ బీహెచ్ఈఎల్ సంస్థ సరఫరా చేసిన దరలకి, ప్రభుత్వం చెల్లించిన ధరకు మధ్య 300 శాతం వ్యత్యాసం ఉండటాన్ని కాగ్ ఆక్షేపించింది.
ఇరిగేషన్ శాఖ అధికారులు అసలు పరిశీలించారా…?
ఈ నాలుగు ప్యాకేజీల్లో బీహెచ్ఈఎల్ కు కాంట్రాక్టర్లు కేవలం 1686 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించగా%ౌౌ%కాంట్రాక్టర్లకు ప్రభుత్వం మాత్రం 7211 కోట్ల రూపాయలు చెల్లించడం గమనార్హం. అంటే ఇక్కడే 5 వేల కోట్ల రూపాయలకు పైగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు కాగ్ గుర్తించింది. బిల్లులు చెల్లించే ముందు ఆయా కాంట్రాక్టుర్లు వివిధ సంస్థల నుండి కొనుగోలు చేసిన ఎక్విప్మెంట్ ఇన్వాయిస్ లను ఇరిగేషన్ శాఖ అధికారులు అసలు పరిశీలించారా..లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఈపీసీ పద్ధతిలో పనులను కేటాయించలేదు..
ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ తర్వాత చేపట్టిన పనులను ఈపీసీ పద్ధతిలో కేటాయించలేదని తమ ఆడిట్ లో గుర్తించినట్లు కాగ్ పేర్కొంది. దీనివల్లే ప్రాజెక్టులో అవినీతి, అంచనాలు పెరిగిపోయాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఓ వైపు ఇరిగేషన్ కార్యాలయాలపై విజిలెన్స్ దాడులు జరుగుతుండటం.. మరోవైపు కాళేశ్వరంపై ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తుండటం ఆసక్తిరేపుతోంది.ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లనుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మూడు బ్యారేజీల నిర్మాణాల్లో అవకతవకలపై జ్యూడిషియల్ విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. తాజాగా ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ భయపడుతోంది : మంత్రి పొన్నం
కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరిగితే బీఆర్ఎస్కు దడ పుడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్. ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు అవినీతి చేయనపుడు ఎందుకు భయపడుతున్నారని అయన ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి విషయంలో కిషన్ రెడ్డి కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఎందుకు విచారణ జరపడం లేదని పొన్నం ఆరోపించారు.