- షబ్బీర్ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్
- వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
- అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలి
- మంచి పాలన కోసం కేసీఆర్ సూచనలు అవసరం
- వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న కేసీఆర్ భార్య శోభ, కేటీఆర్, హరీశ్ రావు లతో కాసేపు మాట్లాడారు. ఆస్పత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడిన సీఎం.. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. వారి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని అన్నారు. కేసీఆర్ కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. కాగా కేసీఆర్ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్రెడ్డి వెంట మంత్రులు సీతక్క, షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. వారి కంటే ముందు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీఎంను పరామర్శించి వెళ్లారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిరది. వైద్యులు వాకర్ సాయంతో ఆయనను నడిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షనలో వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా, ఆయన శరీరం బాగా స్పందించిందని తెలిపారు. బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారని వెల్లడించారు.
సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని, దీన్ని మెడికల్ పరిభాషలో ‘మొబిలైజేషన్ స్టార్ట్’ అంటారని వివరించారు. కేసీఆర్కు ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. శరీరం సహకరిస్తే మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కనీసం 6-8 వారాలపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు.
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలోని తన ప్రత్యర్థులతో వ్యవహరించిన తీరు అప్పట్లో చర్చకు దారి తీసింది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుటుంబానికి అప్పట్లో పొసగకపోయేది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలోని తన ప్రత్యర్థులతో కూడ కలిసిపోయారు. కోట్ల కుటుంబంతో గతంలో కాకుండా సామరస్యపూర్వకంగా వ్యవహరించారని అప్పట్లో పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ ను హాస్పిటల్ లో కలిసి ఆరోగ్య విషయాలు తెలుసుకోవడంతో ఇప్పడు హాట్ టాపిక్ గ మారారు.