ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోపంతో ఉన్న కాంగ్రెస్ తన కోపాన్ని పార్లమెంట్ సమావేశాల్లో చూపించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆయన సోమవారం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కోపం తెచ్చుకోకుండా పార్లమెంట్లో చర్చకు రావాలన్నారు. నిన్న విడుదలైన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్లను హస్తగతం చేసుకుంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను ఓడిరచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 3 రాష్ట్రాల్లో ఘోర ఓటమి తరువాత కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈ ఫలితాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. 9 ఏళ్ల నుంచి బీజేపీని తిట్టడమే ప్రతిపక్ష నేతలు పనిగా పెట్టుకున్నారని.. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇకనైనా సానుకూలంగా ఉండాలని కోరారు. ఓటమి నుంచి పాఠం నేర్చుకుని ముందుకు సాగాలని.. ప్రతికూల ధోరణిని వదిలేయాలని సూచించారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మూడు రాష్ట్రాల్లో మెజారిటీ మార్కును దాటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఘోర ఓటమిపాలైంది. అక్కడ బీజేపీ విజయం సాధించింది. కానీ తెలంగాణలో మాత్రం అధికార బీఆర్ఎస్ ను ఓడిరచడంతో కాంగ్రెస్ తొలి సారి పవర్ చేపట్టనుంది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ముఖ్యమంత్రులు గవర్నర్లకు రాజీనామా లేఖలు పంపించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక సమరానికి ఇటీవల జరిగిన ఎన్నికల్ని సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు.