- తొలిసారి ఓటు వేసిన యువత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గురువారం (నవంబర్ 30) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువత, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వారిలో హైదరాబాద్ మహానగరంలోనే 8 లక్షల మంది కొత్తగా ఓటరు జాబితాల్లోకి ఎక్కారు. వీరంతా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట పరిధిలో కూడా వందల సంఖ్యలో కొత్త ఓటర్లు తొలి ఓట్లు వేశారు. విజ్ఞాన వర్ధిని స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన తోట అక్షయ్ కుమార్, తోట భరత్కుమార్, గర్దాసు పూజిత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కొత్త ఓటర్లు తొలిసారి ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 3,26,18,205 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో 1,63,13,268 పురుష ఓటర్లు.. 1,63,02,261 మహిళలు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 2,676 ట్రాన్స్జెండర్లు, 15,406 సర్వీస్ ఓటర్లు వేయనున్నారు. ఎన్నికలకు ఈసీ 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 12వేల సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. 27,094 వెబ్కాస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది.