తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారు. నగరంలోని పలు పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి అక్కడున్న అధికారులను ఓటింగ్ తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఓటేసేందుకు వచ్చిన ఓటర్లతో కూడా ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్లో 20.79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.