Monday, April 29, 2024

మరోసారి తెరపైకి దిల్లీ లిక్కర్‌ స్కామ్‌

తప్పక చదవండి

అరెస్టు చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీంకు అభిషేక్‌ బోయినపల్లి

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్‌ బోయినపల్లి తన అరెస్టు చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 19ను పరిగణనలోకి తీసుకోకుండా తనను అరెస్ట్‌ చేశారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. అభిషేక్‌ లేవనెత్తిన అంశాలపై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసు మనీలాండరింగ్‌ వ్యవహారంలో గతేడాది అరెస్టైన అభిషేక్‌ బోయినపల్లి.. తన అరెస్టు చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో.. సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. వాదనల సందర్భంగా పీఎంఎల్‌ ఏ సెక్షన్‌ 19 పరిగణనలోకి తీసుకోకుండా అభిషేక్‌ను అరెస్ట్‌ చేశారని ఆయన తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి పేర్కొన్నారు. సీబీఐ కేసులో బెయిల్‌ వచ్చిన తర్వాత.. ఈడీ కేసులో అరెస్టు చేశారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అభిషేక్‌ బోయినపల్లి లేవనెత్తిన అంశాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5 రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించిన సుప్రీం.. ఈడీ కౌంటర్‌కు రిప్లై దాఖలు చేయాలని అభిషేక్‌ తరఫు న్యాయవాదులకు సూచించింది. ఈ మేరకు తదుపరి విచారణను డిసెంబర్‌ 4వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. అభిషేక్‌ బోయినపల్లి బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రూ.3.85 కోట్లు ఇండో స్పిరిట్స్‌ కంపెనీ నుంచి అభిషేక్‌కు బదిలీ అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెండు సంవత్సరాల క్రితం దిల్లీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ తతంగంలో.. ఊహించని పరిణామాలు, రోజుకో మలుపులతో గల్లిగల్లీన ప్రకంపనలు సృష్టించింది. ఓ చిన్న ఆరోపణతో మొదలైన ఈ వ్యవహారం.. పెను దుమారమే రేపి, అత్యున్నత స్థాయి నేతల అరెస్టులకు దారితీసింది. వరుస సోదాలు, రోజుల తరబడి విచారణలతో దిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా మంటలు రేపింది. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అరెస్టు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ పరిణామాలతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదే కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌ బోయినపల్లి తన అరెస్ట్‌ చట్టబద్ధతపై తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు