- విశాఖ ఫిషింగ్ హర్బర్లో భారీ అగ్ని ప్రమాదం
- 60 బోట్లు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం
- మత్స్యకారుల బోట్ల దగ్ధంతో జాలర్ల ఆందోళన
- విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
- ప్రమాద ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు
- ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ప్రమాదంపై తక్షణ విచారణకు ఆదేశం..
విశాఖపట్టణం(ఆదాబ్ హైదరాబాద్) : విశాఖ ఫిషింగ్ ఆర్బర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ జామున ఒక్కసారిగా చెలరేగిన మంటలకు 60కిపైగా బోట్లు తగలబడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగాఉండే ప్రజలు వెంటనే అప్రమత్తం అయినప్పటికీ ఆస్తినష్టాన్ని తగ్గించలేకపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రాలకు కూడా సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కొన్ని గంటల పాటు మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ఇది ప్రమాదంలా లేదని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని కోరుతున్నారు. స్థానిక మత్స్యకారులకు ఈ బోట్లే ప్రధాని జీవనాధారం. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోవడంతో వాళ్లంతా బోరున విలపిస్తున్నారు. ఒక్కో బోటు ఖరీదు 40 నుంచి 50 లక్షల రూపాయలు ఉంటుందని అంటున్నారు. ఈ బోట్ల వల్ల కోట్లలో నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. బోట్లలో ఉండే ఇంధనంతో మంటలు మరింత వ్యాపించాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అగ్ని ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి ఫిషింగ్ హార్బర్ లో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ ఏర్పాటు చేసి, మద్యం మత్తులో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బోటుకు నిప్పు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు యూట్యూబర్, అతని స్నేహితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. వారిని పట్టుకుని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని జేసీ, అధికారులు పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టమని, ఆస్తి నష్టంపై పూర్తి స్థాయి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి 60 వరకు బోట్లు కాలిపోయాయని చెబుతున్నప్పటికీ ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. అధికారులు వెళ్లి పరిశీలిస్తే కాని ఎంత నష్టం చెప్పలేని పరిస్థితి ఉందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద ఘటనతో బోటు ఓనర్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదాలు చూడలేదని అంటున్నారు. ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు కాలిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ గేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం జగన్ సందర్శించి తమకు స్పష్టమైన హావిరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత్స్యకారులకు సద్ది చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై దిగ్భార్రతి వ్యక్తం చేసిన సీఎం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని మంత్రి సీదిరి అప్పలరాజును ఆదేశించారు.ఈ ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కారణాలు అన్వేషించాలని నిర్దేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, వారికి తగు సహాయం చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. మత్స్యకారులు ఆయనకు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కారణాలు అన్వేషించాలని నిర్దేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, వారికి తగు సహాయం చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు.