- కీసర తహశీల్దారే అసలు సూత్రధారి..!
- ముందు కబ్జా ఆవెంటనే జీవో
- జీఓ 59 కింద రెగ్యులరైజేషన్
- నాగారం-ఈసీఐఎల్ మార్గంలోని సర్వే నంబర్…
- 291/4లోని పదుల సంఖ్యలో ప్లాట్లు రెగ్యులరైజేషన్
- సుమారు రూ.40 కోట్ల విలువైన సర్కార్ భూమి పరాధీనం
- మేడ్చల్ కలెక్టర్ స్పందిస్తే మళ్లీ భూమి ప్రభుత్వ పరమయ్యే ఛాన్స్
హైదరాబాద్ : ఎలుక తోక ఎంత ఉతికినా.. నలుపు నలుపే కానీ.. తెలుపు కాదన్నట్లు ఉంది రెవెన్యూ అధికారుల పరిస్థితి. రెవెన్యూ శాఖ గురించి ఎవరు ఏమన్న అనుకొని.. తాము మాత్రం అందినకాడికి దోచుకుంటాం. అంగి.. లాగు జేబులు అన్ని నింపుకుంటాం అన్నట్లు నడుస్తోంది యవ్వారం. నాలుగు కాసులు వస్తాయంటే చాలు ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రజలు, ఉన్నతాధికారులు, చట్టం అనే భయం లేకుండా యధేచ్చగా రెచ్చిపోతున్నారు. ఇందుకోసం ప్రైవేట్ భూములకు దొంగ పట్టాలు ఇవ్వడమే కాదు.. ప్రభుత్వ భూములను సైతం అక్రమంగా రెగ్యులరైజ్ అయ్యేందుకు రెండు చేతులా సహకరిస్తున్నారు. ఇలాగే మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలం తహశీల్దార్ అశోక్ కుమార్, అప్పటి తహశీల్దార్ గౌరీ వత్సల వ్యవహరించిన తీరుతో సుమారు బహిరంగ మార్కెట్లో రూ.40 కోట్ల విలువ పలికే ప్రభుత్వ భూమి అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోవడం గమనార్హం.
మేడ్చేల్-మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలం నాగారం-ఈసీఐఎల్ రహదారిలో భూములకు ఏపాటి రేట్ ఉంటుందో ఇక్కడి రియల్ ఎస్టేట్ చేసిన ఎవరికైనా బాగా తెలిసే ఉంటుంది. గజం వేలు, లక్షల్లోనే పలుకుతుంది. ఈ ప్రాంతం హైదరాబాద్ లో కలిసిపోయి ఉండడంతో.. భూముల రేట్లు ఆకాశాన్ని
తాకుతున్నాయి. అయితే ఇక్కడున్న భూమి వ్యాల్యూను దృష్టిలో పెట్టుకొని కొందరు కబ్జారాయుళ్లు నాగారం-ఈసీఐఎల్ హైవేకు అనుకొని ఉన్న సర్వే నెంబర్ 291/4లోని ప్రభుత్వ భూమిపై కన్నేశారు. అనుకున్నదే తడువుగా ఈ భూమిని కబ్జా పెట్టేసి తాత్కాలిక నిర్మాణాలు కూడా చేపట్టేశారు. అంతేకాక ఈ భూములను సరిగ్గా అధికారులను మ్యానేజ్ చేసుకొని ఎలాగోలా గత ఏడాదిలోనే రిజిస్ట్రేషన్స్ కూడా చేయించేసుకున్నారు. అయితే వీటిని జీవో 59 కింద రిజిస్ట్రేషన్స్, రెగ్యులరైజ్ చేయించుకోవడమే విస్మయం కల్గిస్తోంది.
ఇక ఈ మొత్తం వ్యవహరాన్ని కీసర మండల తహశీల్దార్ అశోక్ కుమార్ దగ్గరుండి చూసుకున్నట్లు సమాచారం. అశోక్ కుమార్ ఇచ్చిన దన్నుతోనే అక్రమార్కులు రెచ్చిపోయినట్లు గుసగుసలు. భూమి రిజిస్ట్రేషన్స్ నుంచి.. రెగ్యులరైజేషన్స్ వరకూ ఆయనే ఉచిత సలహాలు ఇచ్చి కబ్జారాయుళ్లకు పూర్తి స్థాయిలో సహకారమందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కబ్జారాయుళ్లు రెగ్యులరైజేషన్స్ చేసుకున్న ప్లాట్ల విలువ మొత్తం కలిపి ఎంత లేదన్న సుమారు రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అందువల్ల ఈ మొత్తానికి సరిపడేంత కమీషన్ ను ఇప్పటికే కీసర తహశీల్దార్ అశోక్ కుమార్ నొక్కేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎలాంటి నిర్మాణాలు లేని ప్లాట్లకు సైతం రెవెన్యూ అధికారులు జీవో 59 కింద రిజిస్ట్రేషన్స్ చేసినట్లు అర్థమవుతోంది.
ఈ విషయంలో ప్రస్తుత ఉన్న తహశీల్దార్ ఆశోక్ కుమార్ ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరగా, గత ఎమ్మార్వో గౌరీ వత్సల క్రమబద్ధీకరణను ఓకే చేస్తే, తాను రిజిస్ట్రేషన్ చేసానని తెలిపారు. ఇదే విషయంపై గతంలో కీసర తహశీల్దార్గా విదులు నిర్వహించిన గౌరీ వత్సల (ఇప్పుడు అమీన్పూర్ ఎమ్మారో)ను వివరణ కోరగా నేను గ్రామ పంచాయతీ పరిధిలోని జీఓ 59 కు సంబంధించిన ఫైల్ను మాత్రమే చూడటం జరిగింది. అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలకు సంబంధించిన జీఓ 59 రెగ్యులరైజేషన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి చే రెగ్యులరైజేషన్ చేయించడం జరిగిందని గౌరీ వత్సల తెలిపారు.
రెగ్యులరైజేషన్ చేయబడ్డ ప్లాట్స్ :
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్లు
- 7911/2023 (వి. కిరణ్ యాదవ్ తండ్రి వి.మల్లేష్ పేరిట 250 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ: 15-07-2023 ),
- 7912/2023 ( వి.కృష్ణ తండ్రి వి.మల్లేష్ పేరిట 250 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ: 15-07-2023),
- 7916/2023 (కె.సోని భర్త కె.గోపాల్ నాయక్ పేరిట 204 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ: 15-07-2023),
- 8410/2023 (వి.కిరణ్ యాదవ్ తండ్రి వి.మల్లేష్ పేరిట 250 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ : 28-07-2023), – 8411/2023 (వి.కృష్ణ తండ్రి వి.మల్లేష్ పేరిట 250 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ : 28-07-2023),
- 11229/2023( అంకినపల్లి మల్లికార్జున రెడ్డి తండ్రి మాలకొండా రెడ్డి పేరిట 385 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ: 06-10-2023),
- 11230/2023 (కంభం సత్యనారాయణ తండ్రి కంభం మల్లయ్య పేరిట 205 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ : 06-10-2023),
- 11231/2023 (ఎం.శ్రీనివాస్ యాదవ్ తండ్రి ఎం.నారాయణ యాదవ్ పేరిట 260 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ : 06-10-2023),
- 11232/2023 (గూడూరు ఆంజనేయులు గౌడ్ తండ్రి గూడూరు పెంటయ్య గౌడ్ పేరిట 260 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ : 06-10-2023),
- 11234/2023 ( వై. ప్రభాకర్ రెడ్డి తండ్రి వై.కిష్టారెడ్డి పేరిట 385 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ : 06-10-2023),
- 11235/2023 (వి.శ్రవణ్ కుమార్ తండ్రి వి.మల్లేష్ గౌడ్ పేరిట 408 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ : 06-10-2023),
- 11236/2023 ( వి.సుగుణ భర్త వి.మల్లేష్ గౌడ్ పేరిట 320 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ : 06-10-2023),
- 11598/2023 (ఈ.ఎస్. సునీల్ కుమార్ తండ్రి ఈ. శంకర్ పేరిట 373 గజాలు రిజిస్ట్రేషన్ తేదీ : 17-10-2023)
పై రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీవో నెంబర్ 59 ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడడం గమనార్హం.
అయితే హైదరాబాద్ లో భాగమైన ఈప్రాంతంలోని ప్రభుత్వ భూమి ఇంత నిస్సిగ్గుగా కబ్జా కావడం.. కబ్జా అయిన భూముల్లోని ప్లాట్స్ కూడా రెగ్యులరైజ్ కావడం విస్మయం కల్గిస్తోంది. అందువల్ల ప్రస్తుత మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తే కీసర తహశీల్దార్ అశోక్ కుమార్, అప్పటి తహశీల్దార్ గౌరీ వత్సల, గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి, కబ్జారాయుళ్ల బాగోతం, తప్పుడు పద్ధతుల్లో ప్లాట్లను రెగ్యులరైజేషన్ వ్యవహారాలు మొత్తం బయటకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.