Saturday, May 4, 2024

కామారెడ్డిని బంగారు తునక చేస్తా

తప్పక చదవండి
  • కామారెడ్డితో నా అనుబంధం విడదీయరానిది
  • మా అమ్మ పుట్టిన గడ్డ ఇదే.. నాకు బంధం
  • గులాబీ సైనికుడిగా ఇక్కడి నుంచే పోరాటం
  • కెసిఆర్‌ వస్తే ఒక్కడే రాడు..అనేకం వస్తాయ్‌
  • నేనేం చేస్తానో రేపురేపు మీరే చూస్తారు
  • 50 లక్షలతో పట్టబడ్డోడు..నాపై పోటీ చేస్తాడట
  • అలాంటోడు కావలో.. నేను కావాలో తేల్చుకోవాలి
  • రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు వచ్చే వాళ్లతో జాగ్రత్త
  • కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన సీఎం కేసీఆర్‌
  • కాంగ్రెస్‌, బీజేపీలను ఏకిపారేసిన ముఖ్యమంత్రి

విజయాల పరంపర
కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్‌ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆర్‌ఎస్‌) పార్టీని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.


కామారెడ్డి : కామారెడ్డితో తనకు గట్టి అనుబంధం ఉందని..అందుకే ఇక్కడి నుంచి పోటీచేస్తున్నానని సిఎం కెసిఆర్‌ అన్నారు. 50లక్షలతో పట్టుబడ్డ వాడే నాతో పోటీ కొస్తాడట..ఇక వాని సంగతి మీరే చూడాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. బీజేపీ, ప్రధాని మోడీ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతున్న సీఎం కేసీఆర్‌.. తన నామినేషన్‌ పత్రాలను ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. అనంతరం అక్కడ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. వచ్చిన తెలంగాణను వచ్చిన్నం చేయడానికి టీఆర్‌ఎస్‌ పార్టీని అస్థిరం చేయడానికి వచ్చి ఎవడైతే 50 లక్షల నగదుతో దొరికిండో.. ఆయన్నే తీసుకొచ్చి ఇవాళ కేసీఆర్‌ మీద పోటికి పెడతరంట. దీనిమీద కామారెడ్డి ప్రజలు తీర్పు చెప్పాలి. ఆ బాధ్యత మీ మీద ఉంది.’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆలోచించి.. విచక్షణ చేసి ఎవరి ప్రవర్తన ఏంటనేది చూసి ఓటేయాలని సూచించారు. కేసీఆర్‌తో పాటు కామారెడ్డికి కూడా పరిశ్రమలు, ఐటీ రంగం కూడా వస్తాయన్నారు. కేసీఆర్‌ ఒక్కడు రాడు.. కేసీఆర్‌ వెంబడి చాలా వస్తాయని చెప్పారు. ఇప్పుడు చెబితే నరికినట్టు అయితది.. రేపు అందరికి కనబడ్తదని అన్నారు. కామారెడ్డి నియోజక వర్గాన్ని బంగారు తునకలా తయారు చేసి మీకు అప్పగిస్తా అని హామీ ఇచ్చారు. తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఈ నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. ఏడాదిన్నర, రెండేళ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి చూపిస్తానని, ఇది నా వాగ్ధానమని సీఎం శపథం చేశారు. కాబట్టి ప్రజలు ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగతదో బాగా ఆలోచించి ఓటేయాలని ఆయన కోరారు. ’కేసీఆర్‌ వెంట చాలా వస్తయ్‌. విద్యుత్‌ సంస్థలు వస్తయ్‌. ఎడ్యుకేషన్‌ సంస్థలు వస్తయ్‌. పరిశ్రమలు వస్తయ్‌. మీరు ఊహించని అభివృద్ధి జరుగుతది. కామారెడ్డి పట్టణంతోపాటు ఇక్కడి పల్లెల రూపురేఖలు కూడా మారుతయ్‌. చాలా అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని తయారు చేసే బాధ్యత నాది. అందుకు మీ సహకారం కావాలి. మీరు ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించి ఓటేయాలి. ఎవరికి ఓటేస్తే నియోజకవర్గానికి, రాష్ట్రానికి మేలు జరుగుతదో బేరిజు వేసుకోవాలి. అంతేతప్ప ఆగమాగమై ఓటు వేయొద్దని సీఎం సూచించారు. రైతుబంధు వద్దు.. 24 గంటల కరెంటు వద్దు.. ధరణిని తీసేసి అక్కడ పడేస్తాం అని అనేటోళ్లు కావాల్నా.. ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసేటోళ్లు కావాల్నా నిర్ణయించుకోవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై కక్షగట్టి ఒక్క నవోదయ పాఠశాలనుగానీ, ఒక్క మెడికల్‌ కాలేజీనిగానీ ఇయ్యలేదని, మోటార్లకు మీటర్ల పెట్టేందుకు ఒప్పుకోలేదని రూ.25 వేల కోట్ల నిధులకు కోత పెట్టిందని కెసిఆర్‌ విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకులేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే.. కాంగ్రెస్‌ నాయకులేమో కరెంటు వద్దు రైతుబంధు వద్దు అంటున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్‌ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీకి ఎవుసం.. ఎద్దు ఏమైనా తెలుసా.. నాగలి పట్టిండా.. అని ప్రశ్నించారు. నేను కాపోణ్ని, ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతు బాధ తెలుసని అన్నారు.ధరణి రాకముందు రైతులకు ఎంతమంది భర్తలు ఉండేటోళ్లు. వీఆర్వో ఒక భర్త. గిరిదవారీ ఒక భర్త. తాసీల్దార్‌, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌, ఆయనమీద రెవెన్యూ సెక్రటరీ.. సీసీఎల్‌ఏ, రెవెన్యూ మంత్రి ఉండేటోళ్లు. ఇండ్ల ఎవరికి కోపం వచ్చినా.. కైలాసం ఆటల పెద్దపాము మింగినట్టే. భూమికి గోవిందా. ఎల్లయ్య భూమి పుల్లయ్యకు రాసి, పుల్లయ్యది మల్లయ్యకు రాసి.. జుట్లు ముడేసి.. వాళ్లకు తాకట్లు పెట్టి. ఆఫీసుల చుట్టు తింపి. వేలు, లక్షలు గుంజిండ్రు. వాళ్లను నాశనం పట్టిచ్చిండ్రు.’ అని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ధరణి పోర్టల్‌ తెచ్చినమని స్పష్టం చేశారు. ధరణి ద్వారా భూ యాజమాన్యం మార్చేందుకు తన దగ్గర ఉన్న అధికారాన్ని ప్రభుత్వం.. రైతులకే అప్పగించిందని వివరించారు. మీరు బొటనవేలు పెడితేనే భూ యాజమాన్యం మారుతుంది తప్ప.. దాన్ని మార్చే పవర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదని స్పష్టం చేశారు. అలాంటి ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్ల వస్తది రైతుబీమా ఎట్ల వస్తది వడ్లు కొన్న పైసలు ఎట్ల వస్తయని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ధరణి తీసేస్తే పాత గిరిద్వారీలు.. వీఆర్వోలు వస్తరు. అప్పుడు మల్ల ఆఫీసుల చుట్టుతిరిగే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని అనేటోళ్లను బంగాళాఖాతంలో వేయాలని ప్రజలకు సూచించారు. ఓటేసే ముందు పార్టీల ఫిలాసఫీ ఏంటి వాళ్ల ఆలోచన సరళి ఏంటనేది ఆలోచన చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు గిట్లనే నన్ను అర్రతిప్పలు పెట్టిండ్రు.. కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాలికి. ఎడ్డం అంటే తెడ్డెం అని.. అవునంటే కాదని.. ఎన్ని రకాల గోసలు పెట్టాలో అన్ని పెట్టిండ్రు. చివరకు నాకు తిక్కరేగి కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ శవయాత్రనా తెలంగాణ జైత్రయాత్రనా అని బయల్దేరితే.. ఎక్కడికక్కడ మీరు నరసింహులై లేస్తే.. ఊర్లన్ని ఉద్యమాలైతే.. సకల జనుల సమ్మె జరిగితే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేసిండ్రని అన్నారు. వెంటనే ఇచ్చిండ్రా అంటే మల్ల ఏడాదిన్నర ఎగవెట్టిండ్రు. సకల జనుల సమ్మె అని యావన్మంది ఉద్యోగులు, ప్రజలు, రైతులు మొత్తం రోడ్ల మీదకు వచ్చి కొట్లాడితే.. చివరకు తెలంగాణల నూకలు పుట్టకుండా అయితయని అప్పుడు ఇచ్చారని, ఇది కాంగ్రెస్‌ పరిస్థితి అని వివరించారు. ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగదుతో పట్టుబడ్డడో.. ఇప్పుడు ఆ మహాత్ముడే కామారెడ్డిల నామీద పోటికొస్తడంట. ఎవరికి ఏం బుద్ధి చెప్పాల్నో మీరే నిర్ణయం చేయాలని ప్రజలను కోరారు. నాడు తెలంగాణ వచ్చేనాటికి వలసలు పోవుడు.. బతుకపోవుడు.. చెట్టుకొకలు.. పుట్టకొకలు అయినం. ఆగమాగం అయినం. ఇయ్యాళ కాపాడుకోవాలి? నిలబెట్టుకోవాలని ఐదారు పనులు చేసినం. ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కాల్వలకు నీళ్లు ఇచ్చినం. మన దగ్గర నీళ్లకు ట్యాక్స్‌ లేదు. పాత బకాయిలు ఉంటే మాఫీ చేసినం. ఇయ్యాళ్ల కూడా ప్రాజెక్టుల ద్వారా చెరువుల కింద కానీ రఖం కట్టుడు లేదు. అదేవిధంగా కరెంటు 24 గంటలు ఫ్రీ ఇస్తున్నం. గతంలో రైతులను బాగా బాధపెట్టేది. ఇయ్యాళ ఎవడైనా కరెంటోడు వచ్చి.. రైతులను నిలదీసే పరిస్థితి లేదన్నారు. రైతుబంధు స్కీం పెట్టుకున్నం. ఎవరికైనా అపాయం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడొద్దని రైతుబీమా పెట్టుకున్నం. ధాన్యం మీ దగ్గర కొంటే ప్రభుత్వానికి డబ్బులు రావు. ఏటా 500, వెయ్యి కోట్ల నష్టం వస్తది. అయినా సరే అని చెప్పి.. మొత్తం ధాన్యం మీ ఊరికే వచ్చి కొంటున్నం. డబ్బులు కూడా వెంటనే వేస్తున్నం. యాసంగి పంట వరకు ధాన్యం డబ్బులు, రైతుబంధు వస్తున్నాయి. రెండు కలిసి పెట్టుబడికి సరిపోతున్నాయి.అప్పులు తీసుకోవాల్సిన బాధ పోతుంది’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతాంగాన్ని నిలబెట్టుకోవాలి.. వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే పద్ధతితో ముందుకుపోతున్నమని అన్నారు. ఇలా పెన్షన్లు కావచ్చు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. గొర్రెల పెంపకం కావచ్చు.. చేపల పిల్లలు కావచ్చు. ఏ వృత్తికి ఆ వృత్తి వాళ్లు పైకి రావాలని అందర్నీ ఆదుకున్నామన్నారు. ’తెలంగాణ రాకముందు మన గతి ఎట్లుండె. మన చెరువులు ఎట్లుండే. మన చెరువులు మొత్తం బోసిపోయి ఉండె. మిషన్‌ కాకతీయ ద్వారా చేసుకుంటే.. ఈరోజు బ్రహ్మాండంగా 33వేల కోట్ల రూపాయల చేపలను తెలంగాణ ఎగుమతి చేస్తుంది. ఇలా అన్ని వర్గాలు ప్రజలను కడుపుల పెట్టుకని పోతున్నాం.’ అని తెలిపారు. పదేండ్ల నుంచి శాంతిభద్రతలు ఎట్లున్నయి? ఒక్కరోజు కర్ఫ్యూ లేదు. కల్లోలం లేదు. వానలు బాగపడి కరువు కూడా లేదని అన్నారు. ఓటు వేసే ముందు అభ్యర్థిని చూడాలి.. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని చూడాలి.. ఏ ప్రభుత్వం ఏర్పడితే మంచిదో అది కూడా చూడాలని ప్రజలకు సూచించారు. కలలో కూడా అనుకోని అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కంటి వెలుగు అనే కార్యక్రమం ఎప్పుడైనా విన్నరా? చరిత్రల ఏ ప్రభుత్వమైనా చేసిందా? అని ప్రశ్నించారు కేసీఆర్‌ కిట్‌ పెట్టి బ్రహ్మండంగా ప్రసవాలు అన్ని ప్రభుత్వ దవాఖానాల్ల జరుగుతున్నాయి. మాతా, శిశు మరణాలు తగ్గినయ్‌.’ అని అన్నారు. వైద్య రంగం కావచ్చు.. విద్య రంగం కావచ్చు. వ్యవసాయ రంగం కావచ్చు.. పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగం పెరుగుతుంది. అని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు