- తెలంగాణలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం
- తనదైన నిర్ణయాల తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి
- ప్రభుత్వ విప్ల నియామకంలో కొత్తవారికి ప్రాధాన్యత
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. అసెంబ్లీలో విప్లను నియమించడం ఆనవాయితీ. అధికార పార్టీకి చెందిన వారిని నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారిని విప్లుగా నియమించింది. ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్యలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి బీర్ల ఐలయ్య.. వేములవాడ నియోజకవర్గం నుంచి ఆది శ్రీనివాస్.. ధర్మపురి నియోజకవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, డోర్నకల్ నియోజకవర్గం నుంచి రాంచందర్ నాయక్ గెలుపొందారు. వీరంతా మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినవారే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు (అడ్లూరి లక్ష్మణ, ఆది శ్రీనివాస్), ఉమ్మడి నల్లగొండ నుంచి బీర్ల ఐలయ్య, ఉమ్మడి వరంగల్ నుంచి రాంచందర్ నాయక్లకు అవకాశం కల్పించింది. ఇక, చీఫ్ విప్లుగా ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వివేక్, వేముల వీరేశం పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుంది. పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస సమావేశాలతో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేసేందుకు వీలుగా కూడా ఐఏఎస్ బదిలీలు, నియామకాలు చేపట్టారు. పైరవీల కంటే పనితీరుకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అధికారుల గత చరిత్ర, పారదర్శకత, సమర్ధతలే ప్రామాణికంగా బదిలీలు, నియామకాలు ఉండాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఈ కసరత్తు జరిగింది. అలాగే, గత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న ఏడుగురి నియామకాలు రద్దు చేశారు. తన టీంలో అంతా నిఖార్సైన ఆఫీసర్లను ఆయన నియమించుకుంటున్నారు. ఇన్నాళ్లూ పక్కనబెట్టిన పవర్ ఫుల్ ఆఫీసర్లు ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. వస్తూనే తమ ప్రాధాన్యాలేంటో చెప్పేస్తున్నారు. దీంతో పాలనలో పరిస్థితులు మారిపోతున్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.