వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ప్రచారం అందుకున్న పాకిస్థాన్ జట్టు, తీరా పోటీలు మొదలయ్యాక రేసులో వెనుకబడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్ వంటి జట్టు చేతిలో కూడా ఓడిపోయింది. వరుస పరాజయాలతో సెమీస్ రేసులో వెనకబడిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో అమీతుమీకి సిద్దమవుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. పేలవ ప్రదర్శనతో జట్టుకు భారంగా మారిన ఇమామ్, షాదాబ్, నవాజ్ ను పాక్ పక్కన పెట్టింది. ఈ ముగ్గురి స్థానంలో ఫఖర్ జమాన్, సల్మాన్, ఉసామాలు జట్టులోకి వచ్చారు. బంగ్లా ఏ మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. మరోవైపు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న బంగ్లా పరువు కోసం పోరాడనుంది. గత మ్యాచ్లో అఫ్గనిస్థాన్ చేతిలో దారుణ ఓటమితో డీలా పడిన బాబర్ సేన ఆల్రౌండ్ ప్రదర్శన చేయాలనే కసితో ఉంది. ప్రధాన పేసర్లు షాహీన్ ఆఫ్రిది, హ్యారిస్ రౌఫ్ తొలి స్పెల్లో వికెట్లు తీస్తే.. బంగ్లా కోలుకోవడం కష్టమే. నిలకడగా రాణిస్తున్న ఓపెనర్లు లిట్టన్ దాస్, తంజిద్ హసన్తో పాటు సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీంపై బంగ్లా భారీ ఆశలు పెట్టుకుంది.