- బీజేపీకి ఊడిగం చేస్తున్న వారు ఎలా పోరాడతారు
- ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం
- శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ షర్మిల విమర్శలు
శ్రీకాకుళం : ప్రత్యేక మోదా సాధిస్తామని అన్నవారు ఎక్కడ పోయారని పిసిసి చీఫ్ షర్మిల ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు బీజేపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేను గాని ఎంపీని గానీ గెలిపించారా అని అడిగారు. కానీ 23 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులందరూ బీజేపీకి బానిసలు అయ్యారని ఘాటుగా స్పందించారు. ఏపీనీ ఈరోజు బీజేపీ ఏలుతోందన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని బీజేపీని జగన్ ఒక్కరోజైనా ప్రశ్నించింది లేదన్నారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. మరి ఇచ్చిన హామీ ఏమైంది.. దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రాజకీయంగా దూకుడు పెంచారు. ఇచ్చాపురం నుంచి తన యాత్రను చేపడతానన్నారు. అందులో భాగంగా ఇచ్చాపురంలో ప్రజలతో మమేకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పై కేసు పెట్టిందని ఆరోపిస్తున్నారు. కానీ అది నిజం కాదు. వాస్తవం వేరే ఉందన్నారు. సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డిని ఎంతగా గౌరవిస్తుందో ఆమెను కలిసినప్పుడు నాకు అర్థం అయిందన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయాక ఆయన పేరు కూడా సీబీఐ లిస్టులో చేర్చారు అన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసికూడా రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టగలనా అని తన చేతిలో చేయి పెట్టి కళ్ళల్లోకి చూసి చెప్పారన్నారు. ఇది తెలియక చేసిన పొరపాటు కావచ్చు, తెలిసి చేసింది అయితే కాదన్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి రక్తం, రాజశేఖర్ రెడ్డి బిడ్డ చెబుతున్న మాట అని ప్రజలకు తెలియజేశారు. రాజశేఖర్ రెడ్డి ఏ రోజు బీజేపీ సిద్దాంతాలతో ఏకీభవించలేదు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని ఆరోపించారు. ఈరోజు ఏపీలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే చాలా బాధాకరంగా ఉందన్నారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలందరూ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. అంతే కాకుండా ఆ పార్టీకి బానిసలు అయిపోయారని స్పందించారు. ఏపీ ప్రజలను కూడా ఆ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నట్లు వివరించారు. ఆంధప్రదేశ్ మేలు కోరుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అని పేర్కొన్నారు. మనసుపెట్టి ప్రజలంతా ఆలోచించండి.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించండని కోరారు.