- భారీగా మత్తు పదార్థాల పట్టివేత
హైదరాబాద్ ; న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నారు. ఆల్పాజ్రోలం డ్రగ్ విక్రయాలు తెలంగాణలో జోరుగా పెరగడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. ఆల్పాజ్రోలం విక్రయాలపై పోలీసులు 66 కేసులు నమోదు చేశారు. ఆల్పాజ్రోలం డ్రగ్ ఒక్క గ్రాముని 10 వేలకు డ్రగ్స్ ముఠా అమ్ముతోంది. గడిచిన రెండేళ్లలో తెలంగాణలో 43 కేసులు టీఎస్ న్యాబ్ నమోదు చేసింది. 3.14 కోట్లు విలువైన ఆల్పాజ్రోలం సీజ్ చేసింది. పరమేశ్వర కెమికల్స్ ఎండీ కిరణ్ కుమార్, లింగయ్యగౌడ్ నుంచి 70 కేజీల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో గచ్చిబౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ నుంచి 34 కేజీల మత్తు పదార్థాలను నరసింహ హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్లో మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటి కోసం హవాలా మార్గాన్ని నరసింహ ఎంచుకున్నాడు. కేజీ ఆల్పా జోలాన్ని ఢిల్లీలో 2.4 లక్షలకు కొనుగోలు చేసి హైదరాబాద్లో 3.5 లక్షలకి నరసింహ అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రతి నెల 40 కేజీలకు పైగా మత్తు పదార్థాలను నరసింహ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నర్సింహగౌడ్తో పాటు అతని కుమారుడు రాజశేఖర్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాల ద్వారా వచ్చిన డబ్బుతో నరసింహం కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులను కూడబెట్టారు. నర్సింహగౌడ్పై గతంలో పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్పోర్టులో నరసింహ గౌడ్ ఉన్నాడు. అలాగే ఆల్పాజ్రోలం డ్రగ్ను పలు ఫ్యాక్టరీలల్లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.