- ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత
2023, భారతీయ న్యాయ సంహిత-2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. బ్రిటిష్ కాలంనాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన మూడు బిల్లులు ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మూజువాణి ఓటుతో ఉభయసభల ఆమోదం పొందాయి. క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులను ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్షా ఈ బిల్లులతో ప్రజా సంక్షేమం, సేవలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. సంస్కరణలు తీసుకురావాలన్న తమ సంకల్పానికి ఈ బిల్లులు సంకేతమని చెప్పారు. కొత్త చట్టాలు కేవలం శిక్షలు విధించడమే కాకుండా న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించినట్టు చెప్పారు. పేదలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. దీంతో ఇండియన్ జస్టిస్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లులు చట్టంగా మారడానికి మార్గం సుగమం అయింది. ఈ బిల్లులను పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో డిసెంబర్ 20న లోక్సభ, డిసెంబర్ 21న రాజ్యసభ ఆమోదించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లులను రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఈ బిల్లులపై మాట్లాడుతూ.. ఈ మూడు బిల్లులు.. భారతీయ సాక్ష్య సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ న్యాయ సంహిత 2023 బిల్లులు చరిత్ర సృష్టించే బిల్లులు అని అన్నారు. సభలో ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు. దేశ పౌరులకు హాని కలిగించే, విదేశీ పాలకులకు అనుకూలంగా ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ వలసవాదుల నుంచి వచ్చిందని, ఇప్పుడు వాటి సంకెళ్ళకు విముక్తి లభించిందని అన్నారు. ఆ రోజు ఉభయ సభల నుంచి 141 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. అలా డిసెంబర్ 20న దిగువ సభలో బిల్లులు ఆమోదం పొందాయి. ఇవి వలసరాజ్యాల కాలం నాటి క్రిమినల్ చట్టాలు అని, వీటిని పారద్రోలాల్సిన అవసరం ఉందని అప్పుడు అమిత్ షా అన్నారు. గత ఆగస్టు 11న, ఈ మూడు బిల్లులను మొదట పార్లమెంట్ లోక్ సభలో ప్రతిపాదించారు. అయితే, హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ సవరణలు ప్రతిపాదించడంతో వాటి స్థానంలో తాజా వాటిని చేర్చాలని ఈ నెల ప్రారంభంలో నిర్ణయించారు. భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు ఉంటాయి . ఈ చట్టంలో మొత్తం 20 వరకూ అదనంగా నేరాలను చేర్చారు. వాటిలో 33 సెక్షన్లకు జైలు శిక్షను పెంచారు. 83 నేరాలలో జరిమానాను పెంచారు. 23వ సెక్షన్ లో తప్పనిసరి కనీస పెనాల్టీ అమలు చేశారు. ఆరు నేరాలకు ఇక కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ ఉంది. అయితే ఈ చట్టంలోని 19 సెక్షన్లు తొలగించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 531 సెక్షన్లు ఉంటాయి. చట్టం మొత్తం 177 ప్రొవిషన్స్ ద్వారా సవరించారు. తొమ్మిది కొత్త సెక్షన్లు, 39 కొత్త సబ్ సెక్షన్లు యాడ్ చేశారు. ప్రతిపాదిత చట్టంలో 44 కొత్త ప్రొవిషన్స్, క్లారిఫికేషన్లు ఉన్నాయి. టైమ్లైన్లు 35 పార్ట్స్ కి యాడ్ చేశారు. 35 లొకేషన్స్లో ఆడియో`వీడియో సపోర్ట్ అందించారు. చట్టంలోని ఈ కాలానికి అవసరం లేని మొత్తం 14 సెక్షన్లు తొలగించారు. భారతీయ సాక్ష్యా అధినియం ఇప్పుడు 170 ప్రొవిషన్స్ (పాతచట్టంలో 167 ప్రొవిషన్స్) కలిగి ఉంది. మొత్తం 24 సెక్షన్లు సవరించారు. చట్టంలో రెండు కొత్త ప్రొవిషన్స్ మరియు ఆరు సబ్ ప్రొవిషన్స్ ప్రవేశపెట్టారు. 6 ప్రొవిషన్స్ ను తొలగించారు.