- కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
- వచ్చీరాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
- నియోజకవర్గ ప్రజలకు గ్యారెంటీలపై భట్టి సంతకం
మధిర : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కఅన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అవినీతి కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించబోతున్నారని అన్నారు. కాంగ్రెస గెలిచిన తర్వాత ఇచ్చిన హావిూ మేరకు ఆరుగ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం నాడు కార్తీక పౌర్ణమి రోజున బోనకల్ మండలం, చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నియోజకవర్గ ప్రజలకు హావిూ ఇచ్చిన ఆఫిడవిట్ పైన సంతకం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితం అవుతాను. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని చెప్పారు. నిజాయితీగా నా బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని అన్నారు. మధిర నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పైన పేర్కొన్న విషయాలన్నింటికీ సదా కట్టుబడి ఉంటానని ఆఫిడవిట్తో దేవుడి సాక్షిగా భట్టి విక్రమార్క హావిూ ఇచ్చారు.