- సీపీఐతో పొత్తు ఖరారైందని రేవంత్ రెడ్డి ప్రకటన
- కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలుపుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కుదురినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధిష్ఠానం సూచనలతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి స్వాగతం పలికారు. ఇరు పార్టీల నేతలు సీట్ల అంశంపై చర్చించారు. ఎన్నికలలో ఒక సీటు, ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని వారికి రేవంత్ చెప్పారు. దీనికి సీపీఐ కూడా అంగీకరించింది. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్ధి విజయం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మోడీ, కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలన నుండి విముక్తి అవసరమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఈ కారణంతోనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని సాంబశివరావు చెప్పారు. నెల రోజుల క్రితం నిశ్చితార్థం జరిగితే ఇవాళ పెళ్లి అయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు.ఎన్ని సీట్లు ఇచ్చారనేది ముఖ్యం కాదు, కేసీఆర్ పాలన నుండి ప్రజలను విముక్తి చేశామా లేదా అనేది ముఖ్యమని నారాయణ చెప్పారు.