- ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
- జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో గెలిచాం
- భారత్ న్యాయ్ యాత్ర తర్వాత మోదీ ఇంజిన్ ఆగిపోతుంది
- నాగ్పూర్ కాంగ్రెస్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా గురువారం నాగపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 150 రోజులు 4 వేలకు పైగా కిలోమీటర్లు రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని రేవంత్ గుర్తు చేశారు. భారత్ జోడో యాత్ర చేసిన సమయంలో.. రాహుల్ గాంధీ మొదట అడుగు కర్ణాటకలో పెట్టారని.. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కర్ణాటక తరువాత రాహుల్ గాంధీ తర్వాతి అడుగు తెలంగాణలోనే వేశారని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.
ఇక.. తెలంగాణ తరువాత జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించిందని.. ఈసారి మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి లాజిక్తో శ్రేణుల్లో జోష్ నింపారు. ఇప్పుడు.. రాహుల్ గాంధీ “భారత్ న్యాయ యాత్ర” మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నారని.. దీంతో ఈసారి దేశంలో ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్లమెంట్లోకి చొరబడిన దుండగులను ఆపలేకపోయిన మోదీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా కూడా ఆపలేరంటూ చెప్పుకొచ్చారు. ప్పతి మెడిసిన్కు ఒక ఎక్స్పైరీ తేదీ ఉంటుందన్న రేవంత్.. నరేంద్ర మోదీ అనే మెడిసిన్కు కూడా ఎక్స్పైరీ తేదీ వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పనిచేయదంటూ చలోక్తులు విసిరారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అని బీజేపీ పదే పదే చెబుతుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ అంటే ఆదానీ.. ప్రధాని.. అని తనకు ఓ బీజేపీ నేత చెప్పుకొచ్చారన్నారు. లోక్సభలో రాహుల్ గొంతు విప్పడంతో ఆదానీ ఇంజిన్ ఆగిపోయి.. షెడ్కు పోయిందన్నారు. ఇప్పుడు “భారత్ న్యాయ యాత్ర”తో ప్రధాని ఇంజిన్ కూడా ఆగిపోవడం ఖాయమని.. షెడ్డుకు పంపడం ఖాయమంటూ తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. కాంగ్రెస్ శ్రేణులారా 100 రోజులు దేశం కోసం పనిచేయలని.. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి… దేశాన్ని కాపాడుకుందామని రేవంత్ పిలుపునివ్వగా.. సభలో కార్యకర్తలంతా చేతులెత్తి మద్దతు తెలిపారు.