- మరణశిక్షను తగ్గించిన ఖతార్ కోర్టు
గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది భారత నౌకాదళం మాజీ అధికారులకు ఊరట కలిగింది. మరణశిక్షను జైలు శిక్షగా మారుస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఖతార్లోని అప్పీలేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత్కు చెందిన 8 మంది ఖతార్లో గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అక్కడి కోర్టు వారందరికీ మరణశిక్ష విధిస్తున్నట్లు ఇటీవల విధించిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఆ 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. తమ వారికి పడిన మరణశిక్షను రద్దు చేయించాలని వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ.. ఖతార్ అధికారులతో చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే వారికి విధించిన శిక్షను తగ్గించింది. మరణ శిక్షను జైలు శిక్షకు తగ్గిస్తూ ఖతార్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది.ఈ మేరకు ఖతర్ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆ 8 మంది భారతీయులకు ఎన్ని ఏళ్ల జైలు శిక్ష విధించారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని.. దీనిపై ఖతార్ అధికారులతో తాము చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయని వివరించింది.