- అటల్ బ్రిడ్జికి ప్రధాని మోడీ ప్రారంభం
ముంబై : దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ బిహారి వాజ్పేయి సెవ్రి` నవాశేవ అటల్ సేతు’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారంనాడు ప్రారంభించారు. పట్టణ రవాణా మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని పటిష్టం చేసి ప్రజలకు రాకపోకల సౌకర్యాన్ని సులభతరం చేయాలనే ప్రధాని విజన్లో భాగంగా ఈ వంతెన నిర్మాణం జరిగింది. 2016 డిసెంబర్లో ఈ బ్రిడ్జికి మోడీ శంకుస్థాపన చేశారు. రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన 21.8 కిలోమీటర్ల సిక్స్ లేన్ బ్రిడ్జి ఇది.ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ ఉంటుంది. పుణెళి, గోవా, దక్షిమ భారతదేశానికి కూడా తక్కువ సమయంలో ప్రయాణించవచ్చు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింగ్ ద్వారా నాలుగు చక్రాల వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే వీలుంది. మోటార్ బైక్లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు ఈ బ్రిడ్జిపై అనుమతించరు. ప్రాజెక్టు కారణంగా ఆవాసం కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం పరిహారం అందిస్తోంది రాష్ట్రంలో రూ.30,500 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నాసిక్లోని తపోవన్ గ్రౌండ్లో జరిగిన రాష్టీయ్ర యువ మహోత్సవ్ను ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు నుంచి 16వ తేదీ వరకూ ఏటా జాతీయ యువజన ఉత్సవాలను దేశమంతటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహారాష్ట్ర ఈ ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈరోజు భారతదేశంలోని యువశక్తిని చాటే రోజని, బానిసత్యం రోజుల్లో దేశానికి కొత్త శక్తిని నింపిన స్వామి వివేకానందకు అంకితమని అన్నారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశంలో నారీశక్తిని చాటిన రాజమాత జిజాబాయ్ జయంతి కూడా ఇదేరోజని చెప్పారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా నాసిక్లో రోడ్షో నిర్వహించారు. నగంరోలని శ్రీ కాలారామ్ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.