- టెండర్ల విధానంలోనే దోపిడీకి తెర
- టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు విమర్శ
అమరావతి : తెర ముందు తమ్ముడు, తెర వెనుక అన్న అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ముఖ్యమంత్రి జగన్ తెర లేపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పేషీ ఆధ్వర్యంలో జరిగే ఇసుక కుంభకోణంలో తెర ముందు ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ ఉంటే, తెర వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్లలో సాగిన ఇసుక దోపిడీ ఒక ఎత్తైతే.. వచ్చే ఆరు నెలలు సాగే దోపిడీ మరో ఎత్తనీ అన్నారు. టెండర్ డాక్యుమెంట్లో ఏముందో కూడా తెలుసుకోవటానికి వీలులేకుండా చేశారని విమర్శించారు. ఇసుక టెండర్లో దేశం ఎక్కడా లేని విధంగా 29.5 లక్షల రూపాయల ధర నిర్ణయించడం దోపిడీ కాక మరేంటని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. దోపిడీ కోసమే వెంకట్రెడ్డిని ఏపీఎండీసీ ఎండీగా తీసుకొచ్చారని, మార్చి నెలలోనే హరిత ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు నిషేధించినా ఆదేశాలను బేఖాతరు చేశారని మండిపడ్డారు. నిబంధనలన్నీ ఉల్లంఘించి ఇసుక దోపిడీ చేస్తూ, చంద్రబాబుపై ఎదురు కేసు పెట్టటం సిగ్గుగా అనిపించట్లేదా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇసుక అక్రమాలు, బిల్లుల చెల్లింపులపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఇసుక తవ్వకాలపై దొంగ వే బిల్స్ విషయంలో కలెక్టర్ల నుంచి అధికారులంతా బలికావాల్సిందే అని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు.