Sunday, May 5, 2024

విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

తప్పక చదవండి
  • తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష
  • శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధింపు
  • 2006-11 మధ్య అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు
  • 2016లో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు
  • సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు

తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలక్ష్మికి మద్రాస్‌ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధించింది. అక్రమాస్తుల కేసులో మద్రాస్‌ హైకోర్టు ఈ తీర్పును గురువారం నాడు వెల్లడిరచింది. ఈ కేసులో మంత్రి సహా ఆయన భార్య విశాలక్ష్మిని దోషులుగా నిర్దారించిన మద్రాస్‌ హైకోర్టు.. మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ సందర్భంగా కింది న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టింది. మంత్రి పొన్ముడి, ఆయన భార్య రూ.1.79 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టినట్టు నిర్దారించింది. రెండు రోజుల కిందట వారిని దోషులుగా నిర్దారించిన ఉన్నత న్యాయస్థానం.. గురువారం శిక్షలను విధించింది. 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్‌ జి.జయచంద్రన్‌ అనుమతించారు. విల్లుపురంలోని అవినీతి నిరోధక చట్టం కేసుల్లో 2016, ఏప్రిల్‌ 18న ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా న్యాయమూర్తి పక్కనబెట్టారు. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను సస్పెండ్‌ చేయాలన్న పొన్ముడి తరఫున సీనియర్‌ న్యాయవాది విజ్ఞప్తి చేయగా.. కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అప్పీలుకు 30 రోజులు గడువు ఇచ్చిన కోర్టు.. అప్పటి వరకూ శిక్షను అమలు చేయకుండా నిలిపివేసింది. కోర్టు తీర్పుతో మంత్రి పదవికి పొన్ముడి రాజీనామా చేసే అవకాశం ఉంది.

ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం.. క్రిమినల్‌ కేసులో దోషిగా నిర్దారణ అయి.. మూడేళ్ల జైలు శిక్ష ఖరారయితే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఆటోమేటిక్‌గా అనర్హుడవుతారు. తాజా కేసులో మంత్రి పొన్ముడిని నిర్దోషిగా పేర్కొంటూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అసమంజసంగా ఉన్నాయని జస్టిస్‌ జయచంద్రన్‌ వ్యాఖ్యానించారు. ఆయనకు వ్యతిరేకంగా భారీ సాక్ష్యాలను ఎత్తిచూపారు. ట్రయల్‌ కోర్టు తీర్పును స్పష్టంగా తప్పు అని పేర్కొన్నారు. ఈ కేసులో తొలుత విల్లుపురం ప్రధాన క్రిమినల్‌ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఆ తర్వాత దాన్ని 2015 లో విల్లుపురం అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టుగా మారింది. 2022లో ఈ కేసు వేలూరు జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టుకు బదిలీ అయింది. ఈ తీర్పు పొన్ముడికి ఎదురు దెబ్బ అని డీఎంకె నేతలు చెబుతున్నారు. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని డీఎంకె నేతలు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన మంత్రివర్గం నుంచి పొన్ముడిని తప్పించాలని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి డిమాండ్‌ చేసిన మర్నాడే ఆయనకు శిక్ష ఖరారు కావడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు