- ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రావడంలో వైఎస్ఆర్ పాత్ర
- మేము ఈ పార్టీకి బీ టీమ్ కాదు..
- ప్రాణాలైనా విడుస్తాం.. బీజేపీతో కలువం
- బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి
- ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి
- అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి అక్బరుద్దీన్ కౌంటర్
విద్యుత్ బకాయిలపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ మొండి బకాయిల్లో గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ సౌత్ టాప్లో వున్నాయన్నారు. శ్రీశైలం ఎడమ కాలువలో సొరంగం బ్లాస్ట్ అయి 9 మంది చనిపోయారని, వారిలో ఏఈ ఫాతిమా కూడా వుందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదని సీఎం ప్రశ్నించారు. మొండి బకాయిల విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, ఎంఐఎంలు బాధ్యత తీసుకుంటాయా అని ఆయన నిలదీశారు. అనంతరం అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. జెంటిల్మెన్ అని, ఆయనను జన్మలో మర్చిపోలేను అని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రావడంలో వైఎస్ఆర్ పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో తమకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చినప్పుడు.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేరని అక్బరుద్దీన్ గుర్తుచేశారు. ఎంఐఎం చాలా పార్టీలతో పొత్తు పెట్టుంకుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ మండిపడ్డారు. తాము ఎప్పుడూ ముస్లింల హక్కుల కోసమే పోరాటం చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయబోమని, నిత్యం ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒకానొక సమయంలో.. సీఎం రేవంత్ రెడ్డికి, అక్బరుద్దీన్కి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది.
ఇదే సమయంలో.. ఎంఐఎం పార్టీ బీజేపీకి బీ-టీం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము ఏనాటికీ బీజేపీకి బీ-టీం కాబోమని తేల్చి చెప్పారు. ప్రాణాలైనా వదిలేస్తాము కానీ.. బీజేపీతో మాత్రం కలిసి నడవబోము అని అక్బరుద్దీన్ సభా సాక్షిగా తెగేసి చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడినుంచైనా పోటీ చేసే హక్కు ఉందని.. ముస్లిం క్యాండిడేట్ ఉన్నంతమాత్రాన అక్కడి నుంచి పోటీ చేయొద్దు.. చేస్తే వేరే పార్టీకి బీ-టీం అనటం.. మూర?త్వమే అవుతుదంటూ సీఎం రేవంత్ రెడ్డికి తననదైన శైలిలో చురకలంటించారు. బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందిందని అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. తాము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుందని.. దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని అక్బరుద్దీన్ గుర్తు చేశారు.