- ప్రభుత్వ భూమిలో లేని నిర్మాణాలు ఉన్నట్లు నివేదికలు
- కీసర గత తహశీల్దార్, ఆర్ఐల చిత్ర విచిత్రాలు
- నాగారం మున్సిపల్ లిమిట్స్లోని ప్రభుత్వ భూమిలోని నిర్మాణాల అక్రమ క్రమబద్ధీకరణకు సహకారం
- సదరు ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్
- ఇప్పటికీ అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్న నాగారం కమిషనర్
ప్రభుత్వ భూములను రక్షించాల్సిన వారే భక్షిస్తే ఇంకేముంటుంది. కంచె చేను మేస్తే ఇక చెప్పేదేముంటుంది. సరిగ్గా మేడ్చేల్-మల్కాజ్ గిరి జిల్లా కీసర గత తహశీల్దార్ గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్లు ఇలాంటి పనులే వెలగబెట్టారు. నాగారం మున్సిపల్ లిమిట్స్ లోని సర్కార్ ల్యాండ్ అయిన సర్వే నెం.291/4లో నిర్మాణాలు లేకున్నా.. ఉన్నట్లు అప్పటి తహశీల్దార్ నివేదికలు పంపడం విస్మయం కల్గిస్తోంది. ప్రభుత్వ భూమిలో ఎప్పటి నుంచో కొందరు నివాసాలను ఏర్పాటు చేసుకున్నట్లు జీవో నెంబర్ 59 ద్వారా క్రమబద్ధీకరణ కీసర పాత తహశీల్దార్ గౌరీ వత్సల, ఆర్ఐలు పూర్తి స్థాయిలో సహకరించడం గమ్మత్తుగా ఉంది. అయితే వీరు చేసిన ఘనకార్యం తెలిసి స్థానికులు ముక్కున వేలేసుకోవడం వారి వంతైంది. లేని నిర్మాణాలు ఉన్నట్లు వాటిని 59 జీవో కింద క్రమబద్ధీకరించేందుకు సహకరించడం ఆశ్చర్యం కల్గించింది. దీంతో తప్పుడు పద్ధతుల్లో సర్వే నెం.291/4లోని ప్రభుత్వ భూమి పరాధీనం అయ్యేలా చేసిన కీసర పాత తహశీల్దార్ గౌరీ వత్సల,ఆర్ఐ కిషోర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ను నాగారం మున్సిపల్ ప్రజలు అభ్యర్థిస్తున్నారు. సర్వే నెం.291/4లో అక్రమ పద్ధతిల్లో క్రమబద్ధీకరించబడిన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని కోరుతున్నారు. అలాగే బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉండి అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు పరాధీనం అయ్యేందుకు సహకరించిన గత తహశీల్దార్ గౌరీ వత్సల,ఆర్ఐ కిషోర్ లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కౌన్సిలర్లు కూడా డిమాండ్ చేశారు.
అక్రమార్కులకు నాగారం మున్సిపల్ కమిషనర్ రెడ్ కార్పెట్
మరోవైపు సర్వే. నెం. 291/4లో ఇప్పటికీ అక్రమ నిర్మాణాలు కొన సాగుతూనే ఉన్నాయి. ఇదే విషయమై ఆదాబ్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే ఆదా బ్ లో వచ్చిన కథనాలపై ప్రస్తుత తహశీల్దార్ సీరి యస్గా రియాక్ట్ అయ్యా రు. సర్వే. నెం. 291/4లో జరిగే ఎలాంటి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని నాగారం మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ కు లేఖ రాశారు. అయితే ప్రస్తుత తహశీల్దార్ నుంచి కమిషనర్ కు లేఖ రాసినప్పటికీ.. యధేచ్చగా అక్రమ నిర్మాణాలకు రాజేంద్ర కుమార్ అనుమతులు ఇవ్వడం విస్మయం కల్గిస్తోంది.