- ఎమ్మెల్యే కోటాలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్
- గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్
- వీరిని మంత్రివర్గంలోనూ తీసుకునే అవకాశం
- సమాచారం ఇచ్చి నామినేషన్లకు సిద్దం కావాలన్న అధిష్టానం
- అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి మార్క్
- 18న వరకు నామినేష్లు.. 29న పోలింగ్
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తిచేసింది.. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. రెండురోజుల్లో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి గడువు ముగుస్తుంది. అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసింది. మొత్తంగా నలుగురి పేర్లను పైనల్ చేసినట్లుగా సమాచారం.సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ఈ నలుగురి ఎంపిక చేసినట్లు భావించాల్సి ఉంటుంది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు. అసెంబ్లీ కోఆర్డినేటర్ గా ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేశారు. తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ ఇద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు.
విద్యార్థి ఉద్యమం నుంచి బల్మూరి వెంకట్
బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి పార్టీ వేంటే ఉన్నారు.అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్ ఎస్ యూఐ తరపున అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు . టీఎస్ పీఎస్ సీలో పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించి గట్టిగా పోరాటం చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్టీ కోసం కష్టపడి పని చేశారు, జైలుకి కూడా వెళ్లారు. జైల్లో ఉన్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లి బల్మూరి వెంకట్ ను పరామర్శించారు.ఇక, అద్దంకి దయాకర్ పార్టీ వాయిస్ ను అనేక వేదికలపై బలంగా వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ ప్లే చేశారు. ఉద్యమంతో పాటు కష్టకాలంలో పార్టీ కోసం పని చేశారనే ఉద్దేశంతో ఈ ఇద్దరిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అనేకమంది పేర్లు తెరమీదకు వచ్చాయి
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అనేకమంది పేర్లు తెరమీదకు వచ్చాయి. సీనియర్ల పేర్లు వినిపించాయి. మొదటి నుంచి అభ్యర్థుల జాబితాలో అద్దంకి దయాకర్ పేరు ఉన్నప్పట్టికీ.. సడెన్ గా వచ్చిన పేరు మాత్రం బల్మూరి వెంకట్ అని చెప్పొచ్చు. ఎమ్మెల్యే సీటుని త్యాగం చేయడంతో పాటు పార్టీకి సంబంధించి కీ రోల్ ప్లే చేశారు. బల్మూరి వెంకట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని కన్హయ్య కుమార్ కూడా జాతీయ స్థాయిలో పట్టుబట్టినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కూడా బల్మూరి వెంకట్ విషయంలో పాజిటివ్ గా ఉన్నారు. పార్టీ కోసం వెంకట్ కష్టపడి పని చేశారని స్వయంగా రేవంత్ రెడ్డి పలు వేదికల మీద చెప్పారు. కాగా, వీరిద్దరిని లోక్ సభ ఎన్నికల బరిలో దింపాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ యోచన చేసింది.
కేబినెట్ లో ఇప్పటివరకు మైనార్టీలు లేరు.
ఈ నలుగురిని ఎమ్మెల్సీలుగా చేయడంతో పాటు కేబినెట్ లోకి కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ లో ఇప్పటివరకు మైనార్టీలు లేరు కాబట్టి అమీర్ అలీ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన కోడ్ రావడానికి ముందే కేబినెట్ విస్తరణ చేయాలనే యోచిస్తున్నారు. వచ్చే నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ లను కేబినెట్ లోకి తీసుకోవాలని అనుకున్నారు. అయితే, వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఎన్నికల్లో ఓడిన వారికి కాకుండా కొత్త వారికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించింది. పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశాలు ఇవ్వాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించినట్లు తెలుస్తోంది.జావెద్ అలీ ఖాన్ సియాసత్ పేపర్ కు సంబంధించిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి పదవులు ఇవ్వడంతో పాటు మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటే.. తెలంగాణ సమాజానికి ఒక మంచి ఇండికేషన్ ఇచ్చినట్లు ఉంటుందన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది..