- నియామకపు ఉత్తర్వులు జారీ
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆహ్వానితుడిగా రుద్రరాజు
న్యూడిల్లీ : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది. కాంగ్రెస్ అధిష్టానం ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపింది. పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఒకరోజు ముందే పదవీకి రాజీనామా సంగతి తెలిసిందే. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామించింది. షర్మిల పార్టీలో చేరే సమయంలోనే పదవీ వీడేందుకు సిద్దమని రుద్రరాజు ప్రకటించారు. షర్మిల ఇటీవల తన పార్టీ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశార. 2, 3 నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు హైకమాండ్ అప్పగించింది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాలేరు నుంచి బరిలోకి దిగాలని అనుకున్నారు. వివిధ కారణాలతో అక్కడి నుంచి పోటీ చేయడం వీలు పడలేదు. కాంగ్రెస్ పెద్దలను కలువగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతల గురించి అప్పడే చెప్పారని ఊహాగానాలు వచ్చాయి. షర్మిల తన పార్టీని విలీనం చేయడంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు. ఏపీలో ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీకి లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ కరవైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డిని నియమించడం ద్వారా లబ్ది పొందాలని చూస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొననారు. ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అయితే, గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గిడుగు రుద్రరాజు ఏపీ అధ్యక్షుడిగా అందించిన సేవలను అభినందిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.