- దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయం
- డీలర్ దయాకర్.. డాలర్ దయాకర్ అయ్యాడు
- ఇక్కడ దోచి.. అమెరికాలో పెట్టుబడులు
- దయాకర్ కుట్రతోనే జైలుకు పంపించారు
- ఐటి దాడులతో కాంగ్రెస్ను భయపెట్టలేరు
- పాలకుర్తి ప్రచారంలో నిప్పులు చెరిగిన రేవంత్
జనగామ : పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉందని.. పోరాట పటిమ ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ను చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోందన్నారు. ఒకనాడు డీలర్గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయ్యారని వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు దందాలు చేస్తే… రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు కాలేజీలు, ఆసపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. రaాన్సీ రెడ్డికి పౌరసత్వం రాకుండా అడ్డుకున్నార న్నారు. దయాకర్ రావు నమ్మక ద్రోహి… మిత్ర ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. శత్రువులతో చేతులు కలిపి, కుట్రలు చేసి తనను జైలుకు పంపారని.. కాంగ్రెస్ కార్యకర్తలపై దయాకర్ రావు పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పాలకుర్తిలో ఈ దొరను… తెలంగాణలో ఆ దొరను ప్రజలు ఈ బొంద పెట్టడం ఖాయమని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. మీ దగ్గర దోచుకున్న సొమ్ముతో ఎర్రబెల్లి అమెరికాలో పెట్టుబడులు పెడుతుండు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా పాలకుర్తిలో కాంగ్రెస్ను గెలిపించండి. ఈ ఎన్నికలు కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు… నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోండని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్కు సవాల్ విసురుతున్నా… 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. లేకపోతే వరంగల్ ఏకాశిలా పార్కు వద్ద ముక్కు నేలకు రాస్తావా? రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కేసీఆర్ అంటుండు.. కేసీఆర్.. 2009లో నువ్వు సికింద్రాబాద్ ఎంపీ సీట్లు అమ్ముకున్నావ్. రాజ్యసభ సీట్లు కూడా అమ్ముకున్న దుర్మార్గుడివి నువ్వు. కోకాపేట భూములు అమ్ముకున్నది నువ్వు. నమ్మకం అంటే కాంగ్రెస్.. అమ్మకం అంటే బీఆర్ఎస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాను జైలుకెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడేది లేదన్నారు. పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ అధికారులు పెద్దఎత్తున దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఇది బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నాయకులు భయపడబోరని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ అంతా అండగా ఉంటుందన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకులను ఐటీ టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తోందన్నారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐటీ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.