- అక్టోబర్ 5 వరకు పొడగింపుపై సీఐడీ వాదనతో ఏకీభవించిన ఏసీబీకోర్టు..
- 30 అంశాల్లో సుమారు 120కి పైగా ప్రశ్నలు సంధించిన సీఐడీ అధికారులు..
- కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు అనుకూలంగా జరుగుతున్న నిరసనలు..
అమరావతి : చంద్రబాబుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. కస్టడీ, రిమాండ్ పొడిగించా లంటూ సీఐడీ పిటిషన్ వేయడంతో.. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి మరో 11 రోజులు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు రోజులు కస్టడీలో 30 అంశాల్లో 120కి పైగా ప్రశ్నలు సంధించారు సిఐడి అధికారులు. మొదటి రోజు 10 గంటల నుంచి 1గంట వరకు, మధ్యాహ్నం 2గంటల నుండి 5గంటల వరకు విచారణ చేశారు. ఇవాళ ఉదయం 9.30 నిమిషాలకే విచారణ ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తిరిగి 2 గంటలకు విచారణ చేపట్టి 5గంటల వరకు విచారించారు. రెండో రోజు కీలక అంశాలపై ప్రశ్నించిన సీఐడీ బృందం, కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ప్రతి గంటకు ఐదు నిమిషాల బ్రేక్ సమయాల్లో లాయర్లతో చర్చించారు బాబు. బాబుకు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఐటీ ఉద్యోగులు కారులో సంఫీుభావ యాత్ర పేరుతో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ర్యాలీగా వెళ్లారు. పోలీసుల ఆంక్షలు దాటుకొని కష్టంగా రాజమండ్రి చేరుకున్నామని తెలిపారు ఐటీ ఉద్యోగులు. సొంత ప్రాంతానికి రావడానికి ఆంక్షలు విధించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ భార్య బ్రాహ్మణిని కలిసి సంఫీుభావం తెలిపారు ఐటీ ఉద్యోగులు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమన్నారు మోత్కుపల్లి. ప్రజాస్వామ్యంలో ఈ తరహా అరెస్టులు తగవన్నారు. ఎఫ్ఐఆర్లో పేరు లేని చంద్రబాబును నాలుగేళ్ల తర్వాత అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు మోత్కుపల్లి. లోకేష్ను కూడా అరెస్ట్ చేయాలనుకోవటం అన్యాయమని, చంద్రబాబును ఇబ్బందిపెడితే జగన్కే నష్టమన్నారు మోత్కుపల్లి. చంద్రబాబు అరెస్టు బాధ కలిగించిందని జన సైనికులు ఆవేదనతో ఉన్నారని చెప్పారు జనసేన నేత నాగబాబు. టీడీపీ-జనసేన పొత్తును జనసైనికులు స్వాగతిస్తున్నారని, బీజేపీతో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందన్నారాయన. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో త్వరలో పవన్ ప్రకటిస్తారని చెప్పారు నాగబాబు.