- రీజినల్ రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో
- ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు
- మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేష్కు బెయిల్
అమరావతి : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న మూడు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రీజినల్ రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసులల్లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీనరేష్కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్స్ సిద్దార్థ లూథ్ర.. దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు.ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత.. మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు.. ఇలా పలు కేసుల్లో సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది.ఈ మూడు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక, ఐఆర్ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై గతంలో హైకోర్టు విచారణ జరిపి తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవవాల్సి ఉన్నందున విచారణ జరగడం లేదు. కానీ ఆ కేసులో అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసులు పూర్తిగా కుట్ర పూరితమని ..ఒక్క సాక్ష్యం లేకండా.. తప్పుడు ఆరోపణతో కేసులు నమోదు చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తనపై కేసులు నమోదు చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని తనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని.. చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, ఏపీ సర్కార్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అక్టోబర్ 18వ తేదీన ఈ క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేశారు. ఇంత కాలం తీర్పు వెల్లడిరచలేదు. ఎప్పుడు వెల్లడిస్తారో స్పష్టత లేదు.ఈ లోపు చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది.