ఒడిశాలోని బాలాసోర్లో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అదే ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మూడు రైళ్లు ఒకే ట్రాక్పైకి రావడం ఆందోళనకు గురి చేసింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. సుందర్గఢ్ జిల్లాలోని రవుర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సహా రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చాయి. ముందుగా సంబల్పూర్- రవుర్కెలా మెము రైలు, రవుర్కెలా – ఝార్పుగూడ పాసింజర్ రైలు ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చాయి. అయితే లోకోపైలట్లు అప్రమత్తం కావడంతో ఆ రెండూ 100 మీటర్ల దూరంలో ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇక అదే సమయంలో పూరీ-రవుర్కెలా మధ్య నడిచే సూపర్ఫాస్ట్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా అదే ట్రాక్పై దూసుకురావడాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వందేభారత్ లోకో పైలట్ను అప్రమత్తం చేశారు. దీంతో అది 200 మీటర్ల దూరంలో ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగాఈ మూడు రైళ్లు ఒకే ట్రాక్పై వచ్చినట్లు అధికార వర్గాలు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.