కఠ్మండూ : హిమాలయ దేశం నేపాల్లో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్పూర్ జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం చిట్లాంగ్లోఉన్నదని వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈనెల 3న నేపాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో 157 మంది మరణించారు. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలో భూమి కంపించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.