Monday, April 29, 2024

శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానపసిడి ఎటుపాయే..?

తప్పక చదవండి
  • ‘మహంకాళి’ అమ్మవారి నగలు సగం ఖాళీ..?
  • అధికారుల లెక్కల్లో గోల్ మాల్..
  • 2019లోనే సీఎం కార్యాలయంలో ఫిర్యాదు
  • దర్యాప్తు జరిగినా చర్యలు మాత్రం శూన్యం
  • నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్ వి. అనిల్ కుమార్
  • సీబీఐకి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త
  • ఫిర్యాదు పై సీబీఐ విచారణ షురూ!
  • కేసీఆర్ పాలనలో అమ్మవారికి అవమానమా?
  • అసమర్థ రిటైర్డ్ కమిషనర్ వి. అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటున్న భక్తులు

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే అపూర్వ మహోత్సవం బోనాలు.. బోనాల పండుగ వచ్చిందంటే.. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతాయి.. బోనమెత్తిన భక్తజనం.. అమ్మవారి కృపాకటాక్షాలకోసం పూజలు జరుపుతారు.. ముఖ్యంగా పోతరాజుల విన్యాసాలు.. బోనాల చివరిరోజు రంగం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.. రంగం ద్వారా భవిష్యవాణి వినిపించే అమ్మ మాటలకోసం యావత్ దేశ ప్రజానీకం ఆసక్తికరంగా ఎదురు చూస్తారు.. అమ్మ సూచించిన సూచనలు తు.చ. తప్పకుండా పాటిస్తారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకుని, సామాన్య భక్తుల వరకు ఈ బోనాలను పరమ పవిత్రంగా భావిస్తారు.. అలాంటి ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కొందరు అధికారులు స్వార్థ ప్రయోజనాలకై భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఈ అక్రమ అధికారులపై గతంలో ఆదాబ్ హైదరాబాద్ లో ప్రచురితమైన వరుస కథనాలపై దర్యాప్తు పేరుతో కాలయాపన చేసి, నివేదిక ప్రకారం ఈరోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అవినీతికి పాల్పడ్డ అధికారులకు అండగా ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ వి. అనిల్ కుమార్ (రిటైర్డ్) ఉన్నట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో జరిగిన కుంభకోణాలపై అఖిల భారత హిందూ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగిళ్ల శ్రీనివాస్ హై కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది.. గత కొన్ని సంవత్సరాలుగా నాగిళ్ల శ్రీనివాస్ ఈ దేవస్థానానికి సంబంధించిన అనేక కుంభకోణాలను బయటపెట్టడం జరిగింది.. అట్టిదానిపై దేవాదాయ శాఖ అధికారులు, కొందరి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడం జరిగింది..

- Advertisement -

ఈ దేవాలయం 6 (ఏ) టెంపుల్ గా గుర్తింపు పొందింది.. అనగా ఈ దేవాలయం అడ్మినిస్ట్రేషన్ ఎండోమెంట్స్ కమిషనర్ పర్యవేక్షణలో జరుగుతుంది.. అయితే హుండీల ద్వారా, ఇతరత్రా సేవల ద్వారా, కిరాయిల ద్వారా, టెండర్ల ద్వారా, తదితరాల ద్వారా ప్రతి ఏటా సుమారు ఆరు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దేవాలయంలో విచ్చలవిడిగా దోపిడీ, కుంభకోణాలు జరుగుతున్నాయి.. స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ ద్వారా అకౌంట్లు ఆడిట్ చేయడం లేదు.. వారికి సంవత్సరానికి ఒకసారి మామూళ్లు ముడుతున్నాయి..

అసలు కోనేరు లేని ఈ దేవాలయంలో తెప్పోత్సవం జరిగినట్లు 15 లక్షల రూపాయలు ఖర్చు కింద రాశారు.. కళ్యాణ మండపానికి సరియైన అనుమతులు లేవు.. కానీ కోట్ల రూపాయల డొనేషన్లు వసూలు చేసి, మమ అనిపించారు.. లక్షల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది.. తాత్కాలిక షెడ్స్ నిర్మించి, లక్షలు ఖర్చు చేశారు.. దానికి అనుమతి లేదని జీ.హెచ్.ఎం.సి. వారు వాటిని తొలగించడం జరిగింది.. ఇక శానిటేషన్ గురించి సంవత్సరానికి 5 నుండి 8 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.. మరీ విచిత్రంగా ప్రోటోకాల్ అని చెప్పి సంవత్సరానికి 3 నుండి 4 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.. అసలు ప్రోటోకాల్ ఉండకూడదని ఎండోమెంట్స్ యాక్ట్ లో వుంది..

దేవస్థానానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫైల్ నెంబర్ : 17/2 ఆఫ్ 1946 ఫైల్ మాయమైంది.. వీటిలో ఈ దేవస్థానానికి సంబంధించిన స్థిర, చరాస్తుల వివరాలు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో సహా ఉన్నాయి.. ఈ దేవస్థానానికి సర్వ్ నెంబర్ 92 బోలక్ పూర్ విలేజ్, సికింద్రాబాద్ లో ఒక ఎకరా 37 గుంటల స్థలం వుంది.. ఈ స్థలం విలువ నేటికీ రూ. 200 కోట్లు.. దీని యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.. ఈ దేవస్థానానికి వేరే ప్రాంతాలలో కూడా స్థలాలు ఉన్నట్టు తెలుస్తోంది.. రిజిస్ట్రేషన్ ఫైల్ మాయం చేయడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.. ఇల్లీగల్ కబ్జాలో వున్నవారి నుండి లోపాయికారి ఒప్పొందం చేసుకోవడం వల్లనేని నాగిళ్ల శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.. అసలు ఈ ఫైల్ బయటపడితే దేవస్థానానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. అవన్నీ బయటపడతాయి.. నిజంగానే ఆ ఫైల్ మాయమైతే ఈ రోజు వరకు ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు..?

ఈ దేవస్థానంలో దాదాపు 2.5 కేజీల పై చిలుకు బంగారం మాయమైంది.. 2005 సంవత్సరంలో వున్న బంగారం వివరాలు 2017 సంవత్సరం గోల్డ్ లెక్కల ప్రకారం 76 ఐటమ్స్ మాయమయ్యాయి.. వీటిపై నాగిళ్ల శ్రీనివాస్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.. అయితే డీసీపీ నార్త్ జోన్ వారు ఏమీ మిస్ అవ్వలేదు అన్నీ సక్రమంగానే ఉన్నాయని లేఖ పంపించడం జరిగింది.. కొసమెరుపు ఏమిటంటే కంప్లైంట్ లేకుండానే దర్యాప్తు చేశారట.. మరి ఏమి దర్యాప్తు చేశారు..? ఏమీ పరిశీలించి ఈ మాట చెప్పారు.. అన్నీ ఆధారాలు సమర్పించాలని కోరడం జరిగింది.. కానీ సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా ఈ రోజు వరకు ఎలాంటి సమాధానం లేదు..

సీబీఐ రంగ ప్రవేశం :
తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని, సీబీఐకి నాగిళ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది.. వారు ఇటీవలే తమ టీమ్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలియజేశారు.. ఇప్పటికైనా కేటుగాళ్లు చట్టానికి చిక్కేలా ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకుందాం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు