Tuesday, April 30, 2024

అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయింది..

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం
  • అయిన మూడోవంతు సీట్లను గెల్చుకున్నాం
  • పనులు చేయకుండా ప్రచారం చేస్తే బాగుండేది
  • ఓట్ల తేడాకూడా కేవలం 1.85 శాతం మాత్రమే
  • కలసికట్టుగా పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవాలి
  • మహబూబాబాద్‌ సమీక్షలో బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌

హైదరాబాద్‌ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని బీఅర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనము, రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలేదని అన్నారు. ప్రజలు కూడా బీఆర్‌ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మహబూబాద్‌ పార్లమెంట్‌ నియోజకర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని అన్నారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్ట లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్‌ మనకు తేడా కేవలం 1.85 శాతం అన్నారు. పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటామని అన్నారు. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామని తెలిపారు. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడ తామని అన్నారు. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్‌తో పాటు.. పొడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం గతంలో అందించిందన్నారు. అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదు, ఇలాంటి వాటన్నింటి సమీక్ష చేసుకుని ముందుకుపోతామన్నారు. ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు కూడా అనుకో లేదు. నోటికి ఏది వస్తే అది హామీలుగా ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని కేటీఆర్‌ అన్నారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చారు. కాంగ్రెస్‌ వాళ్ల తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డులు ఇవ్వలేదు అని తప్పుడు ప్రచారం చేశారు. ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదని ఆరోపంచారు. తొమ్మిది న్నరేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6,47,479 రేషన్‌ కార్డులు ఇచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. అంతేకాదు దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మేము ఏనాడు చెప్పుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అత్యధిక వేతనాలు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేసుకోలేదన్నారు. దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73శాతం జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్‌. 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదని గుర్తు చేశారు. దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వమే కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడంలో విఫలమయ్యాం. అందుకే కాంగ్రెస్‌ పార్టీ అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే మేమే గెలిచే వాళ్లం అన్నారు. స్థానిక సంస్థల నుంచి మెదలుకొని, అసెంబ్లీ దాకా బలమైన నాయకత్వం మనకున్నది. బలమైన ప్రతిపక్షం మనది. అన్నిటికి మించి కేసీఆర్‌ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికలే మన గెలుపునకు సోపానం కావాలన్నారు. ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్‌ రెడ్డి అనేక మాటలు మాట్లాడారు. రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోండని సూచించారు. అధికారంలోకి రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులంటూ, శ్వేతపత్రాలంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుందాం. అనుబంధ సంఘాలను బలోపేతం చేసుకుందామన్నారు. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. గిరి జనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్‌ తో పాటు.. పోడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో కొనసాగించింది. అయినా గిరిజనులు ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదన్నారు. ఇలాంటి వాటన్నింటిపై ఆత్మవిమర్శ చేసుకుని ముందుకుపోదామని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు