Friday, May 3, 2024

దేశంలో రామరాజ్యం..

తప్పక చదవండి
  • నాసిన్‌ కేంద్రాన్ని ప్రారంభించిన మోడీ
  • బెంగుళూరుకు సమీపంలోని అనంతలో ఏర్పాటు
  • అయోద్యతో దేశం రామమయంగా మారిందని వ్యాఖ్య
  • రాముడు సుపరిపాలనకు ప్రతీక అన్న మోడీ

అనంతపురం : నేషనల్‌ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌)ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని రూ.541 కోట్లతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బెంగళూరు ఎయిర్‌ పోర్టు నుంచి ఈ అకాడమీకి గంట సేపట్లో చేరుకునేంత దూరం ఉంటుంది. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ లో శిక్షణ ఇచ్చే తరహాలోనే ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైన వారికి ఈ నాసిన్‌ లోనే ట్రైనింగ్‌ ఇస్తారు. నాసిన్‌ కోసం ప్రత్యేక రైల్వే లైన్‌ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న సన్నాహకాల మధ్య, దేశమంతా ఇప్పుడు రామమయం అయిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం గురించి మాట్లాడేవారని గుర్తు చేశారు. రామ్‌లల్లా దీక్షకు ముందు 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. రాముడి జీవిత పరిధి, అతని స్ఫూర్తి, విశ్వాసం భక్తి పరిధిని మించినవన్నారు. రాముడు సాంఘిక జీవితంలో సుపరిపాలనకు ఒక ప్రతీక అని, అతను యావత్‌ దేశానికి గొప్ప ప్రేరణగా మారగలడని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సమయాన్ని వృథా చేయకుండా పనులు పూర్తి చేస్తారనే నమ్మకం ఉందని, ఖర్చు తక్కువగా ఉంటుందని భగవంతుడు భరత్‌తో చెప్పాడన్నారు. గత కొన్నేళ్లుగా, మా ప్రభుత్వం ఖర్చుపై దృష్టి పెట్టిందని తెలిపారు. రామరాజ్యం మన అందరికీ ఆదర్శప్రాయం అన్న మోదీ.. రామరాజ్యం సుపరిపాలన నాలుగు స్తంభాలపై నిలిచిందని తెలిపారు. ఈ నాలుగు స్థంభాలు ఏ మాత్రం నిర్భయంగా తలలు పట్టుకుని నడవగలవు, ఎక్కడ ప్రతి పౌరుడిని సమానంగా చూస్తావో, ఎక్కడ బలహీనులకు రక్షణ ఉంటుందో, అక్కడ మతం అంటే కర్తవ్యం ప్రధానం అన్నారు. అధర్మంగా వచ్చే పదవులు అక్కర్లేదు అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలో రామరాజ్యం నడుస్తోందని తెలిపారు. రాముడి మార్గంలో నడిస్తే దేశం భవిష్యత్తు బాగుటుందన్నారు. అలాగే అంతర్జాతీయ స్థానంలో భారత వాణిజ్యం విధానానికి మంచి పేరుందన్న మోదీ, ఈజ్‌ ఆఫ్‌ డూయిండ్‌కి నాసిన్‌ లాంటి సంస్థలతో చాలా ప్రయోజనం ఉంటుందన్నారు. మన అధికారులు కూడా రాముడిని ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. జీఎస్టీ రూపంలో దేశానికి కొత్త ఆధునికతను అందించామని ప్రధాని మోదీ అన్నారు. పన్నుల విధానంలో దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. 7 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చామని, దీని వల్ల దాదాపు రూ.2.5 లక్షల కోట్ల పన్ను ఆదా అయిందన్నారు. నేడు, దేశంలోని పన్ను చెల్లింపుదారు తన పన్ను సక్రమంగా ఉపయోగపడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పన్ను చెల్లిస్తున్నారన్నారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే ప్రతీ పైసా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. సుపరిపాలన అంటే ఇదేనన్నారు. 2014 వరకు రూ.2లక్షల వరకు పన్ను మినహాయింపు ఉందని, ఇప్పుడు ఆ మినహాయింపుని రూ.6లక్షలకు పెంచామన్నారు. దేశంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇదిలావుంటే, పాలసముద్రం సమీపంలో 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాసిన్‌ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడి నుంచి గంటలో చేరుకునేంత దూరం ఉండటం కలిసొచ్చే అంశం. ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు, ఐఆర్‌ఎస్‌లకు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. నాసిన్‌ పరిసరాల్లో పూర్తిగా సోలార్‌ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు నాసిన్‌ కోసం ప్రత్యేక రైల్వేలైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సత్యసాయి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా తొలుత భారీ భద్రత మధ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి ఆలయానికి మోదీ చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభాల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. వీరభద్రేశ్వర స్వామికి ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతా అపహరణ ఘట్టాన్ని తోలుబొమ్మల ఆట ద్వారా ప్రదర్శించారు. తోలుబొమ్మలాటను వీక్షించిన నరేంద్ర మోడీ సీత రామస్వామి నామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. ఆలయంలో గల వీరభద్ర స్వామి, దుర్గాదేవి, ఏడు శిరస్సుల నాగేంద్రుడు, ఏకశిలా నంది విగ్రహం, వేలాడే స్తంభం, విరుపన్న రక్త చాయలు, అర్దాంతంగా ఆగిన కళ్యాణ మండపం, సీత దేవి పాదం, నాట్య మండపంలో రాతి స్తంభాల పై చెక్కిన వివిధ రూపాల దేవతామూర్తుల శిల్పాలను ప్రధానమంత్రి మోడీ వీక్షించారు. భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో లేపాక్షి దేవాలయం చాలా అద్భుతంగా ఉందని ఇక్కడ ఉన్న చిత్ర ,శిల్పాలు చూడడానికి చూడముచ్చటగా ఉన్నాయని ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనపరస్తానని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు. ఆలయం వెలుపలికి వచ్చిన అనంతరం ప్రధానమంత్రి మోడీ ప్రజలకు అభివాదం తెలియజేస్తూ పెనుగొండ నియోజకవర్గం పాలసముద్రం గ్రామంలోని నాసిక్‌ అకాడమీ ప్రారంభించేందుకు బయలుదేరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు