- బాత్రూంలో జారిపడిన కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి
- యశోదా ఆసుపత్రిలో కోలుకుంటున్న మాజీ సీఎం
- కేసీఆర్ ను పరామర్శించేందుకు భారీగా తరలివస్తున్న వైనం
- తన ఆరోగ్య రీత్యా ఎవరినీ కలవలేనని కేసీఆర్ స్పష్టీకరణ
- ఆరోగ్యవంతుడ్ని అయ్యాక అందరినీ కలుస్తానని వెల్లడి
యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముక సర్జీరి తరువాత కేసీఆర్ కోలుకుంటున్నారు. ఈక్రమంలో ఎంతోమంది ప్రముఖులు ఆయన్ని స్వయంగా కలిసి పరామర్శించేందుకు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్టారావు, రామోదర రాజనర్శింహ, శ్రీధర్ బాబు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఆయన్ని స్వయంగా కలిసి..ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.. కాగా, తనను చూసేందుకు యశోద ఆసుపత్రికి దయచేసి రావ్వొద్దని కోరారు. తనతో పాటు వందలాది మంది పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదన్నారు. ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు తనను బయటకు పంపడం లేదన్నారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలోనే సాధారణ స్థితికి చేరుకొని మీ ముందుకు వస్తానన్నారు. ఈ మేరకు ఆసుపత్రి బెడ్ నుంచి వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
కేసీఆర్ సందేశం..
‘ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాది, వేలాదిగా తరలివచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్తో యశోద హాస్పిటల్లో చేరాను. ఈ సందర్భంలో వైద్య బృందం నన్ను సీరియస్గా హెచ్చరించింది. అదేంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి. దాంతో నెలల తరబడి బయటకు పోలేరని చెబుతున్నారు. దాన్ని గమనించి, దయచేసి మీ అభిమానానికి వెయ్యి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరందరూ బాధపడకుండా మీ స్వస్థలాలకు మంచిగా, క్షేమంగా వెనుదిరిగి వెళ్లాలి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంకో పది రోజుల వరకు ఎవరూ కూడా తరలిరావొద్దని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. హాస్పిటల్లో మనం కాకుండా వందలాది మంది కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ల క్షేమం కూడా మనకు ముఖ్యం. కాబట్టి మీరు అన్యదగా భావించకుండా, క్రమశిక్షణతో మీ ఇళ్లకు చేరండి. మంచిగ అయిన తర్వాత నేను ప్రజల మధ్యన ఉండేవాన్నే కాబట్టి, మనం కలుసుకుందాం. దానికి ఇబ్బంది లేదు. దయచేసి నా కోరికను మన్నించి, నా మాటను గౌరవించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా విజ్ఞప్తిని మీరు తప్పకుండా మన్నిస్తారని భావిస్తున్నాను’ కేసీఆర్ పేర్కొన్నారు.