- కబ్జా కోరల్లో శ్రీ మహా దేవ్ ఆలయ భూమి కథనానికి దేవాదాయ, రెవెన్యూ అధికారుల స్పందన
- భూమిని స్వాధీనంలోకి తీసుకున్న ఎండోమెంట్ శాఖ
హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్) : రంగారెడ్డి జిల్లా చెవేళ్ల మండలం కుమ్మెర శ్రీ మహాదేవ్ స్వామి వారి ఆలయ భూముల పరిరక్షణ, అన్యక్రాంతంపై ఈనెల 12న ఆదాబ్ లో రాసిన కథనానికి రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు స్పందించారు. కబ్జా కోరల్లో శ్రీ మహాదేవ్ ఆలయ భూమి పేరుతో రాసిన వార్తపై ఎండోమెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నేరుగా కుమ్మెర గ్రామానికి వెళ్లిన రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు గ్రామస్థుల సమక్షంలో శ్రీ మహాదేవ్ స్వామి దేవాలయ భూముల అన్యక్రాంతంపై సర్పంచ్ సమక్షంలో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే టెంపుల్ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు తేల్చారు.
దీంతో కుమ్మెర గ్రామస్థుల సమక్షంలోనే సర్వే నెంబర్ 195, 196 లలోని ల్యాండ్ దేవాలయానికే చెందినదిగా అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే స్థానికుల సమక్షంలో అన్యక్రాంతానికి గురైన భూమిని రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు పంచనామా జరిపి, అనంతరం ఆ ల్యాండ్ లో బోర్డ్ పాతి.. ఎవరు భూమిని ఆక్రమించాలని చూసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవాలయ భూమి అన్యక్రాంతంపై మంచి కథనాన్ని రాసిన ఆదాబ్ కు, వెంటనే స్పందించిన ఎండోమెంట్ కమిషనర్ వి. అనిల్ కుమార్, వారి బృందానికి భక్తులు, స్థానిక ప్రజలు అభినందనలు తెలియజేశారు.