- మళ్ళీ పొరపాటు జరగబోనివ్వమని క్లారిటీ
- ఆత్మపరిశీలనలో బీఆర్ఎస్ పార్టీ
- పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ
- జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకోరు..?
- లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో కేటీఆర్
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని అభిప్రాయం బలంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు అన్నారు. లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను నాయకులకు కేటీఆర్ సూచించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో మూడింటిలో ఒక వంతు సీట్లు గెలిచామని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. నెల రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైందని ఆయన విమర్శించారు. తెలంగాణలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంటుందని కేటీఆర్ అన్నారు. అయితే ఇందులో బీఆర్ఎస్ పార్టీకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఉన్న జిల్లాలను కుదించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేస్తామని అంటున్నారని తెలిపారు. జిల్లాలను రద్దు చేస్తే ఆయా జిల్లాల్లో ఉన్న ప్రజలు ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి, వేరే వారికి టిక్కెట్ ఇచ్చి ఉంటే బాగుడేందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అలా జరగనివ్వబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రజలు ఊరుకుంటారా.?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లాల సంఖ్యను తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా.? అని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపడడం లేదని.. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని తక్కువ చేసి చూపించి, అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్లే మొదట దాడి మొదలు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.