- కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లున
- సీబీఐ చేత విచారణ చేయాలంటూ పిటిషన్
- వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
- విచారణను రెండు వారాలకు వాయిదా
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ సేఫ్టీపై దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మహాదేవపురం పోలీసు స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిల్లర్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర సీఎస్కు డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి నుంచి సమాచారం తీసుకుని వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.
కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటన బాధ్యులను ఎవరినీ వదిలిపెట్టబోమని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి హెచ్చరించారు. అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకం పనులు ఎలా చేశారని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రాజెక్టు అధికారులు, ఇంజినీర్లతో రివ్యూ నిర్వహించిన ఆయన.. తమకు సంబంధం లేదంటూ ఏదో ఒక లేఖ అధికారులకు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల కాంట్రాక్టర్లను కూడా పిలిచి చర్చించాలని ఆదేశించారు.