- ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి
- ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేశారు..
- దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది?
- రిజెక్ట్ చేస్తే వాపస్ ఎందుకు ఇవ్వరు?
- కేంద్ర నిధులు రూ.83 కోట్లు ఏమయ్యాయి?
- ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం రేవంత్ రెడ్డి
- పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు
- ఈ సమస్యలపై త్వరలో కమిటీ ఏర్పాటు!
హైదరాబాద్ : భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ధరణి పోర్టల్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ సవిూక్షకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, దమోదర రాజనర్సింహ, పలువురు ఉన్నాతాధికారులు హాజరయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హావిూలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారు. ధరణిపై లక్షల సంఖ్యలో కంప్లైంట్స్ ఉన్నాయని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సమస్యల పరిష్కారానికి మండల స్థాయి గ్రీవిన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి నివేదికలో పొందుపరచాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ను రూపొందించే బాధ్యత ఎవరికి ఇచ్చారు.. టెండర్ పిలిచారా.. ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేశారని అధికారులను ప్రశ్నించారు. అసలు ఈ దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? నాలుగు సార్లు రిజెక్ట్ చేస్తే ఆ ఫీజంతా ఎవరికి వెళ్తుంది? రిజెక్ట్ చేసినప్పుడు ఫీజు వాపసు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకునే వీలున్నదా? అని అధికారులను అడిగారు. అసలీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని అడిగి తెలుసుకున్నారు. భూ భారతి ప్రాజెక్టు ఏమైంది? అది ఎక్కడి దాకా వచ్చి ఆగింది? కేంద్రం విడుదల చేసిన రూ.83 కోట్లు ఎక్కడికి పోయాయి? అన్న అనేక సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సమీక్ష నడిచింది. ఈ నాలుగేండ్ల కాలంలో క్లాసిఫికేషన్ ఛేంజ్ చేసిన అన్ని వివరాలు, అసైన్డ్, భూదాన్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు ఇచ్చిన ఎన్వోసీలు వంటి పూర్తి వివరాలు సమర్పించాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ను ఆదేశించారు. త్వరలోనే మరో సారి కూర్చొని సమగ్రంగా చర్చిద్దామని సూచించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాన్న విషయాలను నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. వాటి పరిష్కార మార్గాలను కూడా చెప్పారు. కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పరిపాలన వ్యవస్థను తిరిగి పునరుద్దరించాలని, గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. కొత్త ఆర్వోఆర్ చట్టంపై కోర్టు కేసులను కూడా ప్రస్తావించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగేండ్ల కాలంలో ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది దరఖాస్తులను పరిష్కరించారు. ఐతే ఇప్పటికీ 2.31 లక్షలు పెండిరగులోనే ఉన్నాయని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ వివరించడం గమనార్హం. త్వరలోనే ధరణి పోర్టల్, భూ సమస్యలపై కమిటీ వేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో అధికారులతో పాటు నిపుణులు కూడా ఉండొచ్చునని అధికారులు తెలిపారు. ఈ కమిటీ ద్వారా సమగ్ర అధ్యయనం చేసి.. ఆ తర్వాత శాశ్వత పరిష్కార మార్గాలను అమలు చేయనున్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, భూమి సునీల్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్, ధరణి సమస్యల పరిష్కార వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.